కోదాడలో ఉగ్రవాది అరెస్టు | Karnataka blasts case of Terrorist arrest in Kodada | Sakshi
Sakshi News home page

కోదాడలో ఉగ్రవాది అరెస్టు

Aug 10 2016 2:47 AM | Updated on Sep 4 2017 8:34 AM

కోదాడలో ఉగ్రవాది అరెస్టు

కోదాడలో ఉగ్రవాది అరెస్టు

పదహారేళ్ల క్రితం కర్ణాటకలో ఏక కాలంలో వివిధ చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడిన ఘటనలో...

కర్ణాటక బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/బెంగళూరు: పదహారేళ్ల క్రితం కర్ణాటకలో ఏక కాలంలో వివిధ చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడిన ఘటనలో ఉగ్రవాది షేక్ అమీర్ ఆలీ ఆ రాష్ట్ర సీఐడీ అధికారులకు పట్టుబడ్డాడు. కర్ణాటక రాష్ట్ర అదనపు డీజీపీ ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలోని అధికారులు తెలంగాణ పోలీసుల సహకారంతో నల్లగొండ జిల్లా కోదాడలో సోమవారం రాత్రి అమీర్‌ను అరెస్టు చేశారు. దీన్‌దార్ అంజుమాన్ సంస్థ పేరుతో 2000 జూలైలో బెంగళూరులోని జేజే నగర్, హుబ్లీ, కలబుర్గీలో ఏక కాలంలో కొంతమంది బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్ల వెనుక  29 మంది ఉన్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది.

వీరిలో 23 మంది పట్టుబడి వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. మిగిలిన ఏడుగురిలో ఐదుగురు పాకిస్తాన్‌కు చెందిన వారు. మిగిలిన ఇద్దరిలో అమీర్ తాజాగా పట్టుబడగా.. మరొకరు పరారీలో ఉన్నారు. అలీ ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందినవాడు. అప్పట్లో అతనిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉంటున్నాడు. కాగా, అలీ ఐదేళ్లుగా కుటుంబ సభ్యులతో కలసి కోదాడలోనే నివాసం ఉన్నట్లు తెలిసింది. పట్టణంలోని రెహనాజ్ హెల్త్ సెంటర్ పేరిట క్లినిక్‌ను నిర్వహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement