భర్తతో చనువుగా ఉండటాన్ని తట్టుకోలేక.. | Sakshi
Sakshi News home page

భర్తతో చనువుగా ఉంటుందని స్నేహితురాలిని..

Published Thu, Nov 17 2016 9:54 AM

భర్తతో చనువుగా ఉండటాన్ని తట్టుకోలేక.. - Sakshi

జైపూర్: తన భర్తతో చనువుగా ఉంటుందనే అనుమానంతో చిన్ననాటి స్నేహితురాలిని పథకం ప్రకారం హతమార్చిందో యువతి. అనంతరం ప్రమాదవశాత్తు స్నేహితురాలు మరణించిదంటూ కట్టుకథలు అల్లింది. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో ఆమె చివరకు కటకటాల పాలైంది. ఈ సంఘటన రాజస్తాన్ జైపూర్లోని చురులో చోటుచేసుకుంది.

పోలీసులు వివరాల ప్రకారం.... బబిత, మనీషా బాల్య స్నేహితులు కాగా, ఆర్మీ జవాన్ అజయ్తో మనీషా వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో తన భర్తతో బబితకు అక్రమ సంబంధం ఉందన్న అనుమానం కలిగింది. అంతేకాకుండా వారిద్దరూ గంటలకొద్ది ఫోన్లలో మాట్లాడుకుంటున్నారనే అనుమానంతో ఆమెపై మనీషా ఆగ్రహం పెంచుకుంది. దీంతో ఎలాగైనా స్నేహితురాలిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.

అజయ్ వస్తున్నాడని, తనకు తోడు రావాలంటూ మనీషా ఈ నెల 6న బబితను రతన్ఘర్ సమీపంలోని చర్న్వాసి బస్టాండ్కు తీసుకువెళ్లింది. ఈ సందర్భంగా ఇద్దరు స్నేహితురాళ్లు బస్టాండ్ సమీపంలోని ఓ చెరువు వద్ద కూర్చున్నారు. కొంత సమయం గడిచాక, మనీషా అనుకోకుండా పడిపోయినట్లుగా తన చేతికున్న ఉంగరాన్ని నీళ్లలోకి జారవిడిచింది. అది తన ఎంగేజ్మెంట్ రింగ్ అని అదిపోతే అజయ్ ఫీల్ అవుతాడని, తీసివ్వాల్సిందిగా బబితను కోరింది. రింగ్ కోసం చెరువులోకి దిగిన బబిత, లోతు ఎక్కువగా ఉండటంతో తాడు సాయంతో బయటకు వచ్చేందుకు యత్నించింది. అయితే మనీషా...స్నేహితురాలు పైకిరాకుండా గుండెలపై బలంగా కాలితో తన్నడంతో ఆమె నీళ్లలో మునిగిపోయింది.

తన కుమార్తె మృతిపై బబిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. పోస్ట్మార్టం నివేదికతో పాటు మనీషాను తమదైన శైలిలోవిచారణ జరపటంతో నేరం అంగీకరించింది. దీంతో  పోలీసులు బుధవారం మనీషాను అదుపులోకి తీసుకుని ఐపిసి సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement