ఈనెలాఖరు దాకా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు
కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో ఓకే
న్యూఢిల్లీ: దేశంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును జూలై 31 వరకు కొనసాగిస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. పరిస్థితులను బట్టి, కొన్ని ఎంపికచేసిన మార్గాల్లో అంతర్జాతీయ విమానాలను కొనసాగించవచ్చునని వెల్లడించింది. కరోనా కారణంగా మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
జూలై 15 వరకు షెడ్యూల్ అయిన సర్వీసులను నిలిపివేసి, జూన్ 26న ఇచ్చిన సర్క్యులర్ని సవరిస్తూ, జూలై 31 వరకు విమానాల రద్దును కొనసాగించాలని నిర్ణయించింది. వివిధ దేశాల విమానయాన సంస్థలు అంతర్జాతీయ విమానాలను నడిపేందుకు అమెరికా, కెనడా, గల్ఫ్ దేశాలతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్పర్సన్ అరవింద్ సింగ్ చెప్పారు.అమెరికా, యుకె, జర్మనీ, ఫ్రాన్స్లతోనూ చర్చలు జరుపుతున్నట్టు పౌర విమానయాన శాఖ తెలిపింది.