సరయు ఒడ్డున రాముడి భారీ విగ్రహం
328 అడుగుల ఎత్తు.. వ్యయం రూ.330 కోట్లు
యూపీ సర్కారు సన్నాహాలు
లక్నో: ఉత్తరప్రదేశ్లో సరయు నది ఒడ్డున 328 అడుగుల (100 మీటర్ల) రాముడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాముడి జన్మస్థలమైన అయోధ్యకు ప్రచారం కల్పించే ఉద్దేశంతో రూ.330 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి అవనీశ్ అవస్థి తెలిపారు. అయితే విగ్రహ ఏర్పాటుకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ అనుమతి అవసరమని అవస్థి అన్నారు. అలాగే దీపావళి వేడుకల కోసం ప్రత్యేక కార్యక్రమాల్ని చేపట్టనున్నామన్నారు.
రాముడు అయోధ్యకు తిరిగొచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఓ యాత్రను చేపట్టినట్లు, దీనిలో భాగంగా సీఎం యోగి పలు పథకాలను ప్రారంభించనున్నట్లు అవస్థి తెలిపారు. ఈ నెల 18న ‘రామ్కీ పైడీ’ పేరుతో 1.75 లక్షల మట్టి ప్రమిదలతో దీపోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ మేరకు గవర్నర్ రామ్నాయక్కు కార్యక్రమాల వివరా లను అందజేశామన్నారు. అలాగే కార్యక్రమాల్లో భాగంగా గవర్నర్తో కలసి సీఎం యోగి సరయు నదికి హారతివ్వనున్నట్లు తెలిపారు. అలాగే లేజర్ షో ఏర్పాటు చేస్తామని.. ఇండోనేసియా, థాయ్లాండ్ కళాకారులతో రామ్లీలా నాటకాన్ని ప్రదర్శించనున్నట్లు తెలిపారు.