ఉగ్ర కదలికల సమాచారం నేపథ్యంలో పఠాన్కోట్, గుర్దాస్పూర్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా దళాలు శనివారం హైఅలర్ట్ ప్రకటించాయి.
గుర్దాస్పూర్ : ఉగ్ర కదలికల సమాచారం నేపథ్యంలో పఠాన్కోట్, గుర్దాస్పూర్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా దళాలు శనివారం హైఅలర్ట్ ప్రకటించాయి. పఠాన్కోట్ లేదా గుర్దాస్పూర్ ప్రాంతాల్లో ఓ ట్రక్ సంచరిస్తుందంటూ శుక్రవారం సాయంత్రం పాకిస్తాన్ నుంచి వచ్చిన అనుమానాస్పద ఫోన్ కాల్తో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టీస్ టీమ్ (ఎస్డబ్ల్యూఏటీ), బీఎస్ఎఫ్కు చెందిన 400 మంది సిబ్బందితో పంజాబ్ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ఆయా ప్రాంతాల్లో విస్తృత సోదాలు చేపట్టారు.
ముఖ్యంగా బటాలా పట్టణాన్ని ఆర్మీ, బీఎస్ఎఫ్ దళాలు జల్లెడ పట్టాయి. పఠాన్కోట్, గుర్దాస్పూర్ సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది జనవరిలో పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించారు.