సాక్షి, హైదరాబాద్: వడదెబ్బతో మృతి చెందిన వారికి తెలంగాణ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. వడగాల్పులతో 7జిల్లాల్లో 16 మంది మృత్యువాత పడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలపై ఆయన ఇవాళ(శనివారం,మే 23) అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ప్రాణ రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు.
రానున్న మూడు రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్ ఉండనుందని.. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని.. ప్రజల ప్రాణ రక్షణే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని మంత్రి అన్నారు. ఒక్క ప్రాణం కూడా కోల్పోకూడదని.. ఎండ తీవ్రతపై ప్రజలకు గంట గంటకు హెచ్చరికలు ఇవ్వాలి’’ అని మంత్రి పేర్కొన్నారు.
‘‘ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయ, నిర్మాణ కార్మికులకు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. హీట్ వేవ్పై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వడదెబ్బ కేసులకు ఆసుపత్రులు సిద్ధంగా ఉండాలి’’ అని మంత్రి పొంగులేటి సూచించారు.


