‘ఖరీఫ్‌’ మద్దతుకు కేబినెట్‌ ఆమోదం | Cabinet Approval to the Kharif minimum support price | Sakshi
Sakshi News home page

‘ఖరీఫ్‌’ మద్దతుకు కేబినెట్‌ ఆమోదం

Jun 8 2017 1:40 AM | Updated on Sep 5 2017 1:03 PM

ఖరీఫ్‌ సాగులో వరి, పప్పుధాన్యాలు సహా 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

న్యూఢిల్లీ: ఖరీఫ్‌ సాగులో వరి, పప్పుధాన్యాలు సహా 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వచ్చే నెల ప్రారంభం కానున్న ఖరీఫ్‌ సీజన్‌ నేపథ్యంలో రైతులకు మద్దతుగా నిలిచేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌.. వ్యవసాయ శాఖ 2017– 18 ఖరీఫ్‌ సీజన్‌ కోసం చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అయితే ఎంతమొత్తం పెరిగిందనే దానిపై మాత్రం స్పష్టత రాలేదు.

అయితే క్వింటాలుకు వరికి రూ.80 (ప్రస్తుతం సాధారణ గ్రేడ్‌ వరికి రూ.1550, ఏ గ్రేడ్‌ వరికి రూ.1590 ఇస్తున్నారు), పప్పుధాన్యాలకు రూ.400 (రూ.200 బోనస్‌ కలుపుకుని), సోయాబీన్‌కు రూ.175, పత్తికి రూ. 160 పెంచాలనే ప్రతిపాదనలు అందినట్లు సమాచారం. మహారాష్ట, మధ్యప్రదేశ్‌లో రుణమాఫీ కోసం రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే మద్దతు ధరపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అటు, కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ కూడా రైతుల ఆందోళనతో తన మీడియా సమావేశాన్ని రద్దుచేసుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement