పెళ్లయిన మరుక్షణమే ప్రియుడితో పరార్! | bride cheats bridegroom Minutes after wedding in kerala | Sakshi
Sakshi News home page

ప్రియుడితో వధువు పరార్.. భర్త సంబరాలు!

Aug 2 2017 4:53 PM | Updated on Sep 17 2017 5:05 PM

పెళ్లయిన మరుక్షణమే ప్రియుడితో పరార్!

పెళ్లయిన మరుక్షణమే ప్రియుడితో పరార్!

తనకు ఇష్టం లేని వివాహం చేశారన్న కారణంగా ఓ యువతి పెళ్లి జరిగిన కాసేపటికే వరుడికి షాకిచ్చింది.

కొచ్చి: తనకు ఇష్టం లేని వివాహం చేశారన్న కారణంగా ఓ యువతి పెళ్లి జరిగిన కాసేపటికే వరుడికి షాకిచ్చింది. కల్యాణ మండపానికి వచ్చిన తన ప్రియుడు కనిపించగానే అతడితో కలిసి వెళ్లిపోయింది. ఈ ఘటన కేరళలోని త్రిశూరు జిల్లాలో చోటుచేసుకుంది.  ఆ వివరాలిలా ఉన్నాయి.. త్రిశూరులోని ముల్లస్సెరీకి చెందిన యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయించారు. గురువాయూర్ లోని శ్రీకృష్ణుడి ఆలయ కల్యాణ మండపం వివాహ వేదికైంది. గత ఆదివారం (జూలై 31న) వధూవరుల బంధువులతో అంతా సవ్యంగానే సాగిపోతోంది.

మూహూర్త సమయానికి వధువు మెడలో వరుడు తాళి కట్టాడు. అంతలోనే వధువుకు కల్యాణ మండపంలో తన ప్రియుడు కనిపించాడు. ఇష్టం లేని పెళ్లి చేశారన్న ఆగ్రహంతో ఉన్న యువతి తన ప్రియుడితో కలిసి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. ఇక అది మొదలు వరుడు, అతడి బంధువులు వధువు తరఫు వారితో గొడవ పడ్డారు. మీ అమ్మాయి వల్ల పరువు పోయిందని రూ.15 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని వరుడి బంధువులు డిమాండ్ చేశారు. చివరికి రూ.8 లక్షలు ఇచ్చేందుకు యువతి తల్లిదండ్రులు అంగీకరించారు.

వధువు తనను కాదనుకొని వెళ్లిపోయినందుకు వరుడు మాత్రం హ్యాపీగా ఫీలయ్యాడు. తన పెళ్లి చూసేందుకు వచ్చిన బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆ రోజు సాయంత్రం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఫేస్ బుక్, వాట్సాప్ లలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి.

Advertisement
 
Advertisement
Advertisement