బీజేపీ నిరసనలతో కోల్‌కతాలో ఉద్రిక్తత

BJP Workers Launched A Massive Protest In Kolkata - Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ కార్యకర్తల హత్యలను నిరసిస్తూ బీజేపీ బుధవారం కోల్‌కతాలో భారీ నిరసన చేపట్టింది. నిరసనలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన బీజేపీ శ్రేణులను పోలీస్‌ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు అడ్డగించి ముందుకు కదలకుండా నిరోధించారు. బీజేపీ శ్రేణులు ముందుకు కదలకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.

బారికేడ్లను దాటి లోనికి చొచ్చుకువచ్చేందుకు బీజేపీ కార్యకర్తలు చేసిన ప్రయత్నాలను అడ్డుకున్న పోలీసులు నిరసనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయుగోళాలను ప్రయోగించారు. తృణమూల్‌ ప్రభుతంపై నిరసనలకు దిగిన బీజేపీ కార్యకర్తలపై కోల్‌కతా పోలీసులు లాఠీచార్జి చేశారు. నిరసనలు తెలిపేందుకు బీజేపీ శ్రేణులు సంసిద్ధమవడంతో నిత్యం రద్దీగా ఉండే సెంట్రల్‌ కోల్‌తాలో వీధుల్లో పోలీసులు  పెద్దసంఖ్యలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. తృణమూల్‌ దాడులను నిరసిస్తూ బీజేపీ నేతలు కైలాష్‌ విజయవర్గీయ, లాకెట్‌ ఛటర్జీ తదితరులు కోల్‌కతా పోలీస్‌ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.

కాగా, లోక్‌సభ ఎన్నికల అనంతరం బెంగాల్‌లో బీజేపీ, తృణమూల్‌ వర్గాల మధ్య గత పక్షం రోజులుగా కొనసాగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు 13 మంది మరణించారు. వారిలో ఎనిమిది మంది బీజేపీ కార్యకర్తలుకాగా, ఐదుగురు తణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు. మరోవైపు బెంగాల్‌లో పెచ్చుమీరిన హింసాకాండతో అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తారనే ప్రచారం సాగుతోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top