ఢిల్లీలో ఎన్నికలకే ప్రధాని నరేంద్ర మోడీ మొగ్గు చూపుతున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఎన్నికలకే ప్రధాని నరేంద్ర మోడీ మొగ్గు చూపుతున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఇతరుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే బదులు సొంతంగా బలం తెచ్చుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే బాగుంటుందని మోదీ అభిప్రాయపడుతున్నట్లు బీజేపీ నేతలు మీడియాకు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి ఆశావహంగా ఉండడం, ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడకపోవడం తదితర పరిణామాలను అనుకూలంగా మార్చుకోవాలనేది మోదీ వ్యూహాంగా కనిపిస్తోంది. దాంతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుకు మేము సుముఖంగా లేము అని బీజేపీ నేతలు సోమవారం లెప్ట్నెంట్ గవర్నర్తో అన్నట్లు సమాచారం.
కాగా రాష్ట్రపతి పాలనలో ఉన్న ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి పెట్టాలంటూ గత వారం సుప్రీంకోర్టు సూచించిన విషయం తెలిసిందే. కోర్టు సూచనలతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పార్టీలతో చర్చలు చేపట్టారు. మైనార్టీ ప్రభుత్వాన్ని అయినా ఏర్పాటు చేయాలంటూ కోర్టు సూచించడంతో అందరూ బీజేపీకి అవకాశం లభిస్తుందని అనుకున్నా.... కమలదళం కూడా మొదట్లో ఆ దిశగా ప్రయత్నించింది. అయితే మోదీ మాత్రం ఎన్నికలకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.