అరుణాచల్ లో ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ | ArunachalPradesh crisis: SC vacates status quo order on maintaining president rule | Sakshi
Sakshi News home page

అరుణాచల్ లో ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

Feb 18 2016 4:25 PM | Updated on Sep 2 2018 5:24 PM

రాజకీయ సంక్షోభం బారిన అరుణాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలిగిపోయాయి.

న్యూఢిల్లీ: రాజకీయ సంక్షోభం బారిన అరుణాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలిగిపోయాయి. అరుణాచల్ లో రాష్ట్రపతి పాలనపై విధించిన స్టేటస్ కోను సుప్రీంకోర్టు గురువారం ఎత్తివేసింది. కొత్త ప్రభుత్వం చేత ప్రమాణ స్వీకారం చేయించకుండా గవర్నర్‌ను నియంత్రించటంతో పాటు యథాతథ స్థితిని కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేయాలన్న కాంగ్రెస్ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం నిన్న తిరస్కరించింది. రాష్ట్రపతి పాలనను ఉపసంహరించాలని రాష్ట్రపతికి కేంద్ర కేబినెట్ బుధవారం సిఫారసు చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమకు మెజారిటీ ఉందని కాంగ్రెస్ అసమ్మతి నేత పుల్ సారథ్యంలోని 31 మంది ఎమ్మెల్యేలు సోమవారం గవర్నర్‌ను కలిశారు.

60 మంది సభ్యులున్న అరుణాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 47 మంది సభ్యులుండగా.. అసమ్మతి నేత కాలిఖోపుల్ సారథ్యంలో 21 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయటం తెలిసిందే. నబమ్ టుకీ సీఎంగా గల ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు మద్దతిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement