అట్టపెట్టెలో శవమై కనిపించిన ఆర్టిస్ట్
ముంబైలోని కందిల్వీ ప్రాంతంలోని ఓ కాలువలో కనుగొన్న మృత దేహాలను ప్రముఖ చిత్రకారిణి హేమ ఉపాద్యాయ్, ఆమె లాయర్ హరీష్ బంబానివిగా పోలీసులు గుర్తించారు.
ముంబై: శనివారం రాత్రి ముంబైలోని కందిల్వీ ప్రాంతంలోని ఓ కాలువలో కనుగొన్న మృతదేహాలను ప్రముఖ చిత్రకారిణి హేమ ఉపాద్యాయ్, ఆమె లాయర్ హరీష్ బంబానివిగా పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు వీరిద్దరిని హతమార్చి అట్టపెట్టెల్లో కుక్కి.. స్మశానవాటిక పక్కనే ఉన్న కాలువలో పడేసారు.
కాలువలో ఉన్న మృతదేహాలను గమనించిన స్వీపర్ పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను సేకరించి పోస్ట్ మార్టం కోసం తరలించారు. హంతకులు ఎవరనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. ఇద్దరినీ ఊపిరాడకుండా చేసి చంపినట్లుగా ప్రాధమికంగా నిర్ధారించిన పోలీసులు.. పోస్టు మార్టం నివేదికలో పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపారు.
హేమ ఉపాద్యాయ్ గుజరాత్ లలిత కళా అకాడమీ అవార్డుతో పాటు జాతీయ లలిత కళా అకాడమీ అవార్డును అందుకున్నారు. హేమ భర్త చింతన్ కూడా చిత్రకారుడే. భర్తతో హేమకు విభేదాలున్నాయి. గతంలో తన గదిలోని గోడలపై చింతన్ అసభ్యకరమైన చిత్రాలు వేశాడని, వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఆమె ఫిర్యాదు చేసింది. ఆ కేసులో హేమకు లాయర్ హరీష్ బంబాని సహకరించాడు. ఈ హత్యలకు సంబంధించి ఇప్పటికే హేమ ఉపాద్యాయ్ భర్త చితన్ తో పాటు మరి కొందరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.


