దళిత ప్రొఫెసర్‌ ఆనంద్‌ అరెస్టు అక్రమం

Anand Teltumbde released by Pune court - Sakshi

వెంటనే విడుదల చేయాలని పోలీసులకు పుణే కోర్టు ఆదేశం

పుణే: దళిత ప్రొఫెసర్‌ ఆనంద్‌ తెల్తుంబ్డే అరెస్ట్‌పై పుణే కోర్టు పోలీసులను తప్పుబట్టింది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. గోవా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెసర్‌ ఆనంద్‌ తెల్తుంబ్డే శనివారం తెల్లవారు జామున కేరళ నుంచి విమానంలో ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే పుణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2017లో ఎల్గార్‌ పరిషత్‌లో జరిగిన సమావేశానికి మావోయిస్టులు మద్దతు తెలిపారనీ, ఆ సమావేశంలో వివిధ నేతల రెచ్చగొట్టే ప్రసంగాల కారణంగానే కోరేగావ్‌–భీమా యుద్ధం స్మారకం వద్ద హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయనేది పోలీసుల ఆరోపణ. తెల్తుంబ్డే మావోయిస్టుల మధ్య సాగిన ఉత్తరప్రత్యుత్తరాల వివరాలు కూడా తమ వద్ద ఉన్నాయంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసు అక్రమమంటూ తెల్తుంబ్డే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు కొట్టివేసేందుకు నిరాకరించిన న్యాయస్థానం.. ఈ నెల 11వ తేదీ వరకు ఆయన్ను అరెస్టు చేయరాదంటూ పోలీసులను ఆదేశించింది. ఆలోగా న్యాయస్థానం నుంచి బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అయితే, పుణే పోలీసులు ఈలోగానే అరెస్టు చేయడం అక్రమమని అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు జడ్జి కిశోర్‌ వదానే పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top