సీబీఐ చీఫ్‌గా మళ్లీ అలోక్‌ వర్మ

Alok Verma reinstated as CBI chief - Sakshi

సంస్థ డైరెక్టర్‌గా ఆయననుతిరిగి నియమించిన సుప్రీంకోర్టు

తొలగించే, బదిలీ చేసే అధికారం కేంద్రానికి లేదని స్పష్టీకరణ

ప్రధాన విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా అధికారాలకు కోత

రఫేల్‌ దర్యాప్తు నుంచి మోదీ తప్పించుకోలేరు: రాహుల్‌

సమతూకం ఉన్న తీర్పు ఇది: అరుణ్‌ జైట్లీ  

సంస్థ డైరెక్టర్‌గా ఆయననుతిరిగి నియమించిన సుప్రీంకోర్టు  తొలగించే, బదిలీ చేసే అధికారం కేంద్రానికి లేదని స్పష్టీకరణ  ప్రధాన విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా అధికారాలకు కోత  రఫేల్‌ దర్యాప్తు నుంచి మోదీ తప్పించుకోలేరు: రాహుల్‌  సమతూకం ఉన్న తీర్పు ఇది: అరుణ్‌ జైట్లీ 

న్యూఢిల్లీ: సీబీఐ అంతఃకలహం కేసులో కేంద్రా నికి మంగళవారం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌ వర్మను పునఃనియమిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే అలోక్‌వర్మ ఎలాంటి ప్రధాన విధానప రమైన నిర్ణయాలూ తీసుకోకుండా కోర్టు నిలు వరించింది. సీబీఐ చీఫ్‌ను నియమించేందుకు, తొలగించేందుకు అధికారం ఉన్న ప్రధాని నేతృ త్వంలోని అత్యున్నతస్థాయి త్రిసభ్య కమిటీ అలోక్‌ వర్మ కేసును పరిశీలించి, ఆయనను సీబీఐ డైరెక్టర్‌ పదవిలో కొనసాగించాలా, వద్దా అన్నది నిర్ణయించేంత వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయంది. ఈ నెలాఖరుతో అలోక్‌ వర్మ పదవీకాలం ముగియనుండటంతో మరో వారంలోపు కేసుపై నిర్ణయం తీసుకోవాలని కమిటీని కోర్టు ఆదేశించింది.

సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవ డం, ఈ గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) సిఫారసుల ఆధా రంగా గతేడాది అక్టోబర్‌ 23 అర్ధరాత్రి కేంద్రం వీరిద్దరినీ పదవుల నుంచి తప్పించి సెలవుపై పంపడం తెలిసిందే. ప్రభుత్వం తనను అక్ర మంగా పదవి నుంచి తప్పించిందంటూ అలోక్‌ వర్మ వేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు తాజా తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. మరోవైపు అలోక్‌ వర్మకు మళ్లీ డైరెక్టర్‌ పదవిని ఇచ్చినప్పటికీ అధికారాలను కోర్టు కత్తిరించింది కాబట్టి ఇది సమతూకంతో ఉన్న తీర్పు అని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు.

తొలగించలేరు, బదిలీ చేయలేరు..
సీబీఐ డైరెక్టర్‌ను ఒకసారి నియమించాక ప్రభు త్వం రెండేళ్లలోపు తొలగించడం కుదరదనీ, ఒకవేళ తొలగించాలంటే నియామకం చేపట్టిన అత్యున్నత స్థాయి కమిటీనే ఆ పని చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ అత్యున్నత స్థాయి కమిటీలో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. ఢిల్లీ ప్రత్యేక పోలీస్‌ సంస్థ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీ ఆమోదం లేకుండా సీబీఐ డైరెక్టర్‌ను బదిలీ చేయడానికీ వీల్లేదని కోర్టు పేర్కొంది. అలోక్‌వర్మపై సీవీసీ ఇంకా విచారణ జరుపు తున్నందున, వారంలోపు సమావేశమై ఈ కేసు ను పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని అత్యున్నతస్థాయి త్రిసభ్య కమిటీని కోర్టు ఆదే శించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఎస్కే కౌల్, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించిం ది. అయితే తీర్పును జస్టిస్‌ గొగోయ్‌ రాసి నప్ప టికీ ఆయన మంగళవారం కోర్టుకు హాజరుకా లేదు.

అలోక్‌ వర్మను సీబీఐ డైరెక్టర్‌ పదవి నుంచి తప్పించే అధికారం సీవీసీకి, కేంద్రానికి ఉందా లేదా అన్న దానిపైనే ఈ కేసులో వాద నలు జరిగాయి. పదవి నుంచి అలోక్, అస్థానా.. ఇద్దరినీ కేంద్రం తప్పించినా అలోక్‌ మాత్రమే కేంద్రంపై కోర్టులో కేసు వేశారు. సీబీఐ డైరెక్టర్‌పై మధ్యంతర చర్యలు తీసుకునే అధికారాన్నీ ప్రభుత్వానికి చట్టం ఇవ్వలేదనీ, సీబీఐని బయటి ప్రలోభాలు, ప్రభావాలకు దూరంగా ఉంచి స్వేచ్ఛ ఇవ్వగలిగితేనే ఆ సంస్థ ఏ భయం, ఆశ్రిత పక్షపాతం లేకుండా ప్రజా ప్రయోజనార్థం పనిచేయగలదని కోర్టు పేర్కొంది. కాబట్టి సీబీఐ డైరెక్టర్‌ విధుల్లో ఏ అధికారీ, సంస్థా జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ సీబీఐ డైరెక్టర్‌పై ఏమైనా చర్యలు తీసుకోవాలంటే అందుకు తగ్గ తీవ్ర కారణం, ప్రజాప్రయోజనం ఉండాలనీ, ఈ విషయాన్ని పరిశీలించే అధికారం కూడా ఎంపిక కమిటీకే ఉంటుందంది.

ప్రభుత్వానికి గుణపాఠం: ఖర్గే
లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి ఓ గుణపాఠమనీ, చెంపదెబ్బ లాంటిదన్నారు. రఫేల్‌ కుంభకోణంపై దర్యాప్తు ప్రారంభించను న్నారనే కారణంతోనే అలోక్‌ వర్మను ప్రధాని నరేంద్ర మోదీ అర్ధరాత్రి విధుల నుంచి తప్పించారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి ఆరోపించారు. ఈ తీర్పుతో కొంత న్యాయం జరిగిందనీ, రఫేల్‌పై విచారణ నుంచి మోదీ తప్పించుకోలేరని హెచ్చరిం చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రధాని, ఆయన కార్యాలయంపై నేరారోపణ చేసినట్లుగా ఉందనీ సీపీఎం, ఆర్జేడీ, పీడీపీ, ఆప్‌ తదితర పార్టీలు పేర్కొన్నాయి. కాబట్టి మోదీ నైతిక బాధ్యత వహించి ప్రధాని పదవికి రాజీనామా చేయాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు.

అలోక్‌ వర్మకు తిరిగి పదవి ఇచ్చిన సుప్రీంకోర్టు ఆయన అధికారా లను తగ్గించింది కాబట్టి ఇది సమతూకంతో ఉన్న తీర్పు అని అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ ప్రతిష్టను, విశ్వసనీయతను కాపాడేం దుకు తాము అలోక్, అస్థానాలను సీవీసీ సిఫారసుల ఆధారంగానే సెలవుపై పంపా మనీ, తమ నిర్ణయం పూర్తిగా సదుద్దేశంతో కూడుకున్నదేనని జైట్లీ సమర్థించుకున్నారు. ఇద్దరు అధికారులు గొడవ పడినందున తమ ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా చట్టబద్ధమైనదేననీ జైట్లీ చెప్పుకొచ్చారు. 

ఆ పరిస్థితి దురదృష్టకరం
అలోక్‌పై అవినీతి ఫిర్యాదును కేబినెట్‌ సెక్రటరీ సీవీసీకి పంపడం, ఆ తర్వాత సీబీఐ డైరెక్టర్‌ బాధ్యతల నుంచి అలోక్‌ను తప్పించాలంటూ సీవీసీ ఆదేశించేలా పరిస్థితులు రావడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘సీవీసీ చెబుతున్న దాని ప్రకారం.. అలోక్‌పై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఆ సంస్థ విచారణ ప్రారంభించింది. అయితే అలోక్‌ సీవీసీకి సహకరించడంపోయి, ఈ ఫిర్యాదును కేబినెట్‌ సెక్రటరీకి ఎవరు చేశారో చెప్పాలని కోరా రు. అస్థానాపై ఆరోపణలు చేసేవరకు ఆయన వెళ్లారు. అస్థానాపై అవినీతి ఆరోపణలున్న అనేక కేసులను అలోక్‌ సీవీసీకి అందించారు. అలాగే అలోక్‌ వర్మపై అస్థానా ఆరోపణలు చేశారు. ఈ తీవ్ర పరిస్థితుల్లోనే అలోక్, అస్థానా ఇద్దరినీ బాధ్యతల నుంచి తప్పించడం సరైన చర్య అని సీవీసీ భావించి, సీవీసీ చట్టంలోని సెక్షన్‌–8, 11ల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది’ అని కోర్టు తన తీర్పులో పేర్కొంది. 

సీబీఐ ‘ఫైట్‌’లైన్‌!
2017 అక్టోబర్‌: సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌గా రాకేశ్‌ అస్థానాను నియమించడంపై సీవీసీ ముందు అలోక్‌ వర్మ అభ్యంతరం. 

2018 జూలై 12: సీబీఐలో ప్రమోషన్లపై జరిగిన సమావేశానికి తన అనుమతి లేకుండానే తన ప్రతినిధిగా అస్థానా హాజరుకావడంపై సీవీసీకి వర్మ లేఖ.
 
ఆగస్టు 24: దర్యాప్తు కొనసాగుతున్న ఓ కేసులో నిందితులను కాపాడడానికి అలోక్‌ వర్మ, ఆయన సహాయకుడైన అదనపు డైరెక్టర్‌ ఎన్‌కే శర్మ  ప్రయత్నించారని, మాంసం వ్యాపారి మొయిన్‌ ఖురేషీ కేసులో వర్మకు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి సతీష్‌ సానా 2 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని ఆరోపిస్తూ సీవీసీ, కేబినెట్‌ సెక్రటరీకి అస్థానా లేఖ. 

►అక్టోబర్‌ 4: సానాను సీబీఐ అరెస్టు చేసి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా, అస్థానాకు రూ.3 కోట్లు చెల్లించినట్టు సానా ఆరోపించారు.  

అక్టోబర్‌ 15: మొయిన్‌ ఖురేషీ కేసులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణపై అస్థానాపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు. 

అక్టోబర్‌ 23: రాకేశ్‌ అస్థానా కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని సీబీఐని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మరో సీబీఐ అధికారి దేవేంద్రకుమార్‌కు ఏడు రోజుల సీబీఐ రిమాండ్‌కు కోర్టు ఆదేశం. అక్టోబర్‌ 15న  అస్థానాపై నమోదు చేసిన ఎఫ్‌ ఐఆర్‌లో కుమార్‌ పేరు కూడా చేర్చారు. 

►అక్టోబర్‌ 24: సీవీసీ సిఫార్సుతో అలోక్, అస్థానాలను సెలవుపై పంపిస్తూ కేంద్రం నిర్ణయం.  

►అక్టోబర్‌ 26: వర్మపై జరుగుతున్న సీవీసీ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ జడ్జీ ఏకే పట్నాయక్‌ను నియమించిన సుప్రీంకోర్టు. 

►నవంబర్‌ 12: సుప్రీంకోర్టుకు సీవీసీ విచారణ నివేదిక.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top