యాత్ర ట్రైలర్‌ : మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను కానీ.. | YSR Biopic Yatra Movie Trailer Released | Sakshi
Sakshi News home page

Jan 7 2019 5:27 PM | Updated on Jan 7 2019 7:01 PM

YSR Biopic Yatra Movie Trailer Released - Sakshi

తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్‌ రెడ్డి చేసిన పాదయాత్రనే ప్రధానంగా చూపించనున్నారు‌. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను చిత్ర బృందం ప్రారంభించింది. అందులో భాగంగా సోమవారం చిత్ర ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది.

పాదయాత్ర ముందు వైఎస్సార్‌కు ఎదురైన కొన్ని పరిస్థితులతో పాటు, పాదయాత్ర సాగిన తీరును ఈ చిత్రంలో ప్రధానంగా చూపించినట్టు ట్రైలర్‌లో ప్రతిబింబించింది. వైఎస్సార్‌ పాదయాత్రలో ప్రజలతో మమేకమైన తీరును కళ్లకు కట్టినట్టు చూపించారు. ‘నా విధేయతను.. విశ్వాసాన్ని బలహీనతగా తీసుకోకండి’, ‘నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకోగలిగాం కానీ.. జనాలకు ఏం కావాలో తెలుసుకోలేకపోయాం’, ‘మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను.. ఇచ్చాక ఆలోచించేది ఏముంది.. ముందుకెళ్లాల్సిందే’ అని మమ్ముట్టీ పలికిన డైలాగులు గుండెకు హత్తుకునేలా ఉన్నాయి. చివర్లో ఓ వ్యక్తి రాజశేఖర ఈ సారి నా ఓటు నీకే.. నీ పార్టీకి కాదు అని పలికిన డైలాగ్‌ ఆకర్షించేదిగా ఉంది.

వైఎస్‌ విజయమ్మగా ఆశ్రిత మేముగంటి
ట్రైలర్‌కు కొద్ది గంటల ముందు సినిమాకు సంబంధించిన మరో విశేషాన్ని చిత్ర బృందం ప్రేక్షకులతో పంచుకుంది. వైఎస్సార్‌ జీవితంలో సగ భాగమైన ఆయన సతీమణి వైఎస్‌ విజయమ్మ పాత్రను ఈ చిత్రంలో ఆశ్రిత వేముగంటి పోషిస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. అందుకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను కూడా రిలీజ్‌ చేసింది. ఫస్ట్‌ లుక్‌లో ఆశ్రిత అచ్చం వైఎస్‌ విజయమ్మను పోలినట్టు ఉన్నారు.

ఇప్పటికే రిలీజ్‌అయిన ఈ చిత్ర టీజర్‌, సాంగ్స్‌కు మంచి రెస్సాన్స్‌ వచ్చింది. వైఎస్సార్‌ అభిమానులతోపాటు, తెలుగు సినీ అభిమానులు కూడా  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం 2019 ఫిబ్రవరి 8న రిలీజ్‌ కానుంది. జగపతిబాబు, సుహాసిని, అనసూయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ మళయాల భాషల్లోనూ యాత్ర సినిమా రిలీజ్‌ అవుతోంది. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు. 

Advertisement
 
Advertisement
Advertisement