
తెలుగు చలన చిత్ర పరిశ్రమను విశాఖ, అమరావతి ఎక్కడకు తరలించాలన్న అంశంపై అన్ని వర్గాలతో సమాలోచన చేస్తున్నామని, అయితే సాగర నగరం విశాఖకు తరలించాలని ఎక్కువ మంది కోరుతున్నారని.. రానున్న కాలంలో అమరావతి నగరం ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాల్లో ఒకటి కానున్న నేపథ్యంలో సినీ పరిశ్రమ ఇక్కడ ఉంటేనే సమంజసంగా ఉంటుందని ఏïపీ సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం సచివాలయంలో తనను కలిసిన సినీ ప్రముఖులకు తెలిపారు. తక్కువ బడ్జెట్ చిత్రాలకు పన్ను రాయితీ ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని, చిత్ర పరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైదరాబాద్లో నిలదొక్కుకునేందుకు అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు తానే కల్పించానని, మళ్లీ ఇప్పుడు పరిశ్రమను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకున్నానన్నారు. సహజ అందాలతో విలసిల్లే విశాఖ, గోదావరి జిల్లాలు ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాలకు ముఖ్య చిరునామాగా ఉండేవని సీఎం గుర్తు చేశారు.
విశాఖ బ్యూటీఫుల్లీ రీమేడ్ సిటీ అయితే అమరావతి ఫ్యూచర్ సిటీ అని అభివర్ణించారు. చలన చిత్ర పరిశ్రమలో ఉండే వారంతా కొత్త రాష్ట్రంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నదే తన అభిలాష అన్నారు. త్వరలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కు పూర్తి స్థాయి పాలకవర్గాన్ని నియమిస్తామన్నారు. చలన చిత్ర పరిశ్రమలో వేర్వేరు రంగాల్లో ఉన్న వారు తమ సృజనను ప్రదర్శించి, రాజధాని తరహా భారీ నిర్మాణాల్లో భాగస్వాములు కావాలని కోరారు. వచ్చే జనవరిలో వేడుక: 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాల ఎంపిక జాబితాలను జ్యూరీ తొలుత సీఎం చంద్రబాబుకు అందించాయి. వచ్చే ఏడాది జనవరిలో నంది చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవాన్ని నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.