మణిరత్నం మల్టీస్టారర్‌ చిత్రానికి శ్రీకారం

మణిరత్నం మల్టీస్టారర్‌ చిత్రానికి శ్రీకారం


దర్శకుడు మణిరత్నం మల్టీస్టారర్‌ చిత్రాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడని గతంలో దళపతి, అగ్నినక్షత్రం వంటి చిత్రాలు నిరూపించాయి. అదే విధంగా ఆయన రూపొందించిన గ్యాంగ్‌స్టర్‌ చిత్రాల్లో నాయకన్, దళపతి ముఖ్యమైన చిత్రాలు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్, మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి వంటి స్టార్స్‌ నటించిన భారీ చిత్రం దళపతి. అరవిందస్వామి యువ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం 1991లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.



 కాగా 25 ఏళ్ల తరువాత అలాంటి చిత్రానికి సీక్వెల్‌కు త్వరలో శ్రీకారం పడనుందన్నది తాజా సమాచారం. ఇందులో ఇళయదళపతి విజయ్, సియాన్‌ విక్రమ్‌ కలిసి నటించనున్నారన్నదే సెన్సేషనల్‌ న్యూస్‌. రజనీకాంత్‌ పాత్రలో విజయ్, మమ్ముట్టి పాత్రలో విక్రమ్‌ నటించనున్నారట. కార్తీ, అధితిరావు జంటగా నటిస్తున్న కాట్రు వెలియిడై చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిన మణిరత్నం తాజాగా దళపతి–2 చిత్రానికి సంబంధించిన చర్చల్లో నిమగ్నమయ్యారని సమాచారం.



 అంతే కాదు ఈ చిత్ర కథను ఇటీవల విజయ్, విక్రమ్‌లకు వినిపించగా వారు నటించడానికి రెడీ అన్నట్లు తెలిసింది. విజయ్, విక్రమ్‌లు మంచి స్నేహితులు కావడం వల్లే ఈ మల్టీస్టారర్‌ చిత్రంలో కలిసి నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. కాగా విజయ్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తన 61వ చిత్రంలో నటిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్, సమంత, నిత్యామీనన్‌ కథానాయికలు నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తేనాండాళ్‌  ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తోంది. తదుపతి ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.



 అయితే ఈ చిత్రానికి ముందే మణిరత్నం దర్శకత్వంలో దళపతి–2 చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా నటుడు విక్రమ్‌ ప్రస్తుతం గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో ధృవనక్షత్రం చిత్రంలోనూ, విజయ్‌చందర్‌ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు. తదుపరి చేసే చిత్రం దళపతి–2 అని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల మాట.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top