
తిమిరుపుడిచవన్ చిత్ర పూజా కార్యక్రమ దృశ్యం
తమిళసినిమా: తిమిరుపుడిచవన్ చిత్రంలో సరికొత్త ఖాకీని చూస్తారని దర్శఖుడు గణేశా పేర్కొన్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గురువారం ప్రారంభమైంది. విజయ్ఆంటోని కథానాయకుడిగా నటిస్తూ, సంగీతం అందిస్తూ, తన విజయ్ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం తిమిరుపుడిచవన్. గణేశా అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్న ఈ చిత్రంలో నివేదాపేతురాజ్ కథానాయకిగా నటిస్తున్నారు.
ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గురువారం ఉదయం చెన్నైలో జరిగాయి. దర్శకుడు గణేశా చిత్ర వివరాలను తెలుపుతూ పోలీస్ కథలతో ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి. ఈ తిమిరుపుడిచవన్ చిత్రంలో ఇంకా కొత్తగా ఏం చెబుతారులే అని కొందరు అనుకోవచ్చునని, ఒక పోలీస్స్టేషన్లో జరిగే సంఘటలతో చిత్ర కథ, కథనం చాలా విన్నూత్నంగా ఉంటాయని కచ్చితంగా చెప్పగలనని అన్నారు.
ఈ చిత్రం కథను రాసుకున్నప్పుడే ఒక స్టార్ హీరో అయితే బాగుంటుందని భావించానన్నారు. ఐదేళ్ల క్రితమే కథను విజయ్అంటోనికి వినిపించానని అన్నారు. ఇప్పుడాయన తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ ఇమేజ్ను సంసాదించుకున్న నటుడని, అందుకే మళ్లీ ఈ తిమిరుపుడిచవన్ చిత్ర కథను చెప్పానని తెలిపారు. అయితే ఈ సారి ఆయన మరో మాట అనకుండా నటించడానికి పచ్చజెండా ఊపారని చెప్పారు. ఇందులో విజయ్ఆంటోనికి జంటగా నటి నివేదాపేతురాజ్ నటిస్తున్నారని తెలిపారు.