నటుడు బోస్ ఇక లేరు
ప్రముఖ సినీ, టీవీ నటుడు సుభాష్ చంద్రబోస్ అలియాస్ బోస్ ఇక లేరు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ఆదివారం తుది శ్వాస విడిచారు. సుమన్ హీరోగా తెరకెక్కిన ‘సాహసపుత్రుడు’ సినిమాతో బోస్ తెలుగు చిత్ర సీమకు పరిచయమయ్యారు. ఆయన ఎక్కువగా కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న బోస్ ‘ఇడియట్, నిన్నే పెళ్లాడతా, అల్లరి రాముడు, శివమణి’ వంటి పలు సినిమాల్లో నటించారు. ఆయనకు ‘ప్రేమఖైదీ’ సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. పలు టీవీ సీరియళ్లలోనూ నటించారు. బోస్ మృతిపట్ల పలువురు సినీ, టీవీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు.