ఇప్పుడు 'జెంటిల్‌మెన్' వస్తే 'శక్తి'లా ఉంటాడు

Sivakarthikeyan Shakthi Movie Released On March 20 - Sakshi

టీవీలో వీడియో జాకీ(వీజే)గా కెరీర్ స్టార్ట్ చేసి, అతి తక్కువ సమయంలో క్రేజీ స్టార్‌గా ఎదిగిన తమిళ హీరో శివ కార్తికేయన్. తమిళనాట సూపర్ ఫాలోయింగ్ ఉన్న అతను 'రెమో', 'సీమ రాజా' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడిగా మారాడు. ఆయన తాజాగా నటించిన సినిమా 'హీరో'. తమిళనాడులో గతేడాది డిసెంబర్‌లో విడుదలై ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని నిర్మాత కోటపాడి జె.రాజేష్ 'శక్తి' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కే.జి.ఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్‌టైనెమెంట్స్‌ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేస్తున్నారు. 'అభిమన్యుడు' దర్శకుడు పి.ఎస్. మిత్రన్ ఈ 'శక్తి'కి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. కల్యాణీ ప్రియదర్శన్ కథానాయిక.

విద్యావ్యవస్థ మీద సినిమా అంటే ఆ చిత్రమే గుర్తొస్తుంది
నిర్మాత కోటపాడి జె.రాజేష్ మాట్లాడుతూ "సామాజిక బాధ్యతతో తీసిన చిత్రమిది. ప్రజల్లో ప్రస్తుత విద్యావ్యవస్థ గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో తీశాం. తమిళనాడులో విశేష ఆదరణ పొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుందని నమ్మకంగా చెప్పగలను. మోడ్రన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, కరెంట్ సినారియో గురించి చర్చించిన సినిమా 'శక్తి'. ప్రేక్షకులందరికీ కనెక్ట్ అవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద సినిమా అంటే 'జెంటిల్‌మెన్' గుర్తుకు వస్తుంది. ప్రస్తుత విద్యా వ‍్యవస్థను సరిచేయడానికి 'జెంటిల్‌మెన్' వస్తే 'శక్తి'లా ఉంటాడు. 'అభిమన్యుడు'లో బ్యాంక్ మోసాల గురించి చర్చించారు. ఈ సినిమాలో విద్యావ్యవస్థ గురించి చర్చించారు. ఈ సినిమాలో శివకార్తికేయన్‌ భిన్నమైన పాత్ర చేశారు.

అతనీ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారు
అర్జున్ ఈ సినిమాకి టర్నింగ్ పాయింట్.. ఆయన సినిమాను మరోస్థాయికి తీసుకు వెళ్లారు. బాలీవుడ్‌ నటుడు అభయ్ డియోల్ దక్షిణాది సినిమాకు కొత్త అయినప్పటికీ ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. రివ్యూల్లో ఆయన నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. తెలుగులో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. అందుకని, ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేస్తున్నాం. ఈ నెల 22 నుంచి తెలంగాణలో థియేటర్లు రీ ఓపెన్ అవుతాయని అంటున్నారు. రెండు రోజులు ఆలస్యంగా నైజాంలో కూడా విడుదల చేస్తాం. శివ కార్తికేయన్ హీరోగా తమిళంలో ఓ సినిమా, సంతానం హీరోగా మరో సినిమా చేస్తున్నాం. మా నిర్మాణ సంస్థలో మరో రెండు సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. మంచి కథ వస్తే తెలుగులోనూ సినిమా చేయాలని చూస్తున్నాం" అన్నారు. ఈ చిత్రానికి ర‌చ‌న‌: పి.య‌స్‌.మిత్ర‌న్‌, పార్తిబ‌న్‌, స‌వారి ముత్తు, ఆంటోనీ భాగ్య‌రాజ్‌, సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా, కెమెరా: జార్జి.సి.విలియ‌మ్స్, ఎడిటింగ్‌: రూబెన్‌, మాట‌లు: రాజేష్ ఎ మూర్తి, పాటలు : రాజశ్రీ సుధాకర్.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top