ప్రముఖ సింగర్ ప్రాణం తీసిన ర్యాష్ డ్రైవింగ్
సాక్షి,ముంబై: మలయాళ మ్యుజీషియన్ బాలభాస్కర్ విషాదాన్ని మరువక ముందే మ్యూజిక్ ఇండస్ట్రీ మరోసారి విచారంలో మునిగిపోయింది. సుప్రసిద్ధ గాయకుడు నితిన్ బాలీ(47) రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. సోమవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ని ఢీకొట్టడంతో తలకి, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది. తీవ్రమైన కడుపు నొప్పి, రక్తపు వాంతులో పాటు బీపీ పెరిగి పరిస్థితి విషమించింది. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే బాలి తుది శ్వాస విడిచారని బంధువులు ప్రకటించారు. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నామని తెలిపారు.
అయితే బాలిపై ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు చేసి, బెయిల్ మంజూరు చేశామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ప్రమాద సమయంలో ఆయన తాగి వున్నారా లేదా అనేది పరీక్షల ఫలితాల అనంతరం నిర్ధారించనున్నామని చెప్పారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్సకోసం వెళ్లాలన్న వైద్యుల సూచనలను బాలి పట్టించుకోలేదని తెలిపారు.
1990వ సంవత్సరంలో నితిన్ బాలీ పాడిన రీమిక్స్ సాంగ్ నీలీ నీలీ అంబర్ పర్ పెద్ద సంచలనం. అలాగే చూకర్ మేరే మన్ కో, ఏక్ అజనబీ హసీనా, పల్ పాల్ దిల్ కే పాస్ లాంటి పాటలతో బాగా పాపులర్ అయ్యారు. ఆరుకు పైగా ఆల్బమ్స్ చేసిన ఆయన ‘నా జానే’తో కరీర్ను ఆరంభించారు. ప్రముఖ టీవీ నటి రోమా భాటియాను వివాహమాడిన బాలి 2012లో లైఫ్ కీ తో లగ్ గయీ చిత్రంకోసం చివరి పాటను పాడారు. మరోవైపు నితిన్ బాలి స్మిక మరణంపై హిందీ సినీ పరిశ్రమ ఆయన ఆత్మకి శాంతి కలగాలంటూ నివాళులు అర్పించింది.