సాయేషా కోరికేంటో తెలుసా?

sayesha saigal Want To Launch Dance School In Mumbai - Sakshi

తమిళసినిమా: కోలీవుడ్‌లో కథానాయకిగా ఎదగాలని ఆశపడుతున్న బాలీవుడ్‌ బామల్లో నటి సాయేషాసైగల్‌ ఒకరు. ప్రఖ్యాత సినీ కుటుంబానికి చెందిన ఈ బ్యూటీ మొదట్లోనే దక్షిణాదిపై దృష్టిసారించింది. అలా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సాయేషా ఇప్పుడు కోలీవుడ్‌కే ప్రాధాన్యతనిస్తానంటోంది. ఇక్కడ తొలి చిత్రం వనమగన్‌ చిత్రం ఈమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. నిజానికి సాయేషా నటించిన ఆ ఒక్క చిత్రమే ఇప్పటికి తెరపైకి వచ్చింది. అయితే ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తోంది. అందులో కార్తీకి జంటగా నటించిన కడైకుట్టి సింగం వచ్చే నెల తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఆ తరువాత విజయ్‌సేతుపతితో రొమాన్స్‌ చేసిన జుంగా చిత్రం, ఆపై ఆర్యతో జత కట్టిన గజనీకాంత్‌ చిత్రం అంటూ వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి.

ఈ మూడు చిత్రాలకు ప్రేక్షకుల మధ్య భారీ అంచనాలే ఉన్నాయి. జుంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో సాయేషా నటనను, ఆమె సహకారాన్ని చిత్ర యూనిట్‌ తెగ మెచ్చేకున్నారు. సాయేషా కూడా జుంగా చిత్రంలో నటించడం మంచి అనుభవం అని పేర్కొంది.  ఒక భేటీలో తను పేర్కొంటూ తాను తమిళ చిత్రాలకే ప్రాధాన్యత నిస్తున్నానని చెప్పింది. అదే విధంగా హీరోయిన్‌ పాత్రకు ప్రాముఖ్యత ఉన్న కథా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నానని చెప్పింది. మరో విషయం ఏమిటంటే తాను చిన్న వయసు నుంచే నాట్యంలో శిక్షణ పొందానని తెలిపింది. అందుకే సినిమాల్లో డాన్స్‌ మూమెంట్స్‌ ఎంత కఠినంగా ఉన్నా సులభంగా చేసేస్తానని చెప్పింది. అదే విధంగా పూర్తి నృత్యభరిత కథా పాత్రలో నటించాలన్నది తన కోరిక అని పేర్కొంది. ఉదాహరణకు తెలుగు చిత్రం మయూరి తరహాలో నాట్యానికి ప్రాధాన్యత ఉన్న చిత్రంలాంటిది చేయాలని ఆశపడుతున్నట్లు చెప్పింది. ఈ సుందరి త్వరలో ముంబైలో డాన్స్‌ స్కూల్‌ను నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తోందట. దానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానంటోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top