
తెలుగు సినిమా పరిశ్రమకు మరో షాక్!
తెలుగు సినిమా పరిశ్రమకు మరో షాక్ తగిలింది. రాజమౌళి 'బాహుబలి' సినిమా దృశ్యాలు బయటకు వచ్చిన ఘటన మరవకముందే మరో లీకేజీ కలకలం రేపింది.
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమకు మరో షాక్ తగిలింది. రాజమౌళి 'బాహుబలి' సినిమా దృశ్యాలు బయటకు వచ్చిన ఘటన మరవకముందే మరో లీకేజీ కలకలం రేపింది. దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రుద్రమదేవి' సినిమా ఆడియో లీకైనట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఆడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
ఆడియో బయటకు ఎలా లీకయిందో తెలుసుకునేందుకు సినిమా యూనిట్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క టైటిల్ పాత్ర పోషించింది. అల్లు అర్జున్, దగ్గుబాటి రానా, కృష్ణంరాజు, ప్రకాశ్ రాజ్, నిత్యా మీనన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.
'బాహుబలి'కి సంబంధించిన 13 నిమిషాల నిడివిగల ఎడిట్ చేసిన సినిమా లీకైన విషయం తెలిసిందే. ఈ కేసులో మకుట విజ్వల్ సంస్థలో విజువల్స్ ఎఫెక్ట్ మేనేజర్గా పనిచేసిన వర్మ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు 'అత్తారింటికి దారేటి' సినిమా విడుదలకు ముందే లీకవడంతో సంచలనం రేగింది. పెద్ద సినిమాలు విడుదలకు ముందే బయటకు లీకవుతుండడం పట్ల నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.