వైఎస్కే, నిహారిక చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ఓ తండ్రి కథ. ఈ చిత్రానికి నంది వెంకట్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఎల్వీ క్రియేషన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అశోక్ రెడ్డి లెంకల నిర్మించారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు ఆడియో లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు వి సముద్ర, సంజీవ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ.. 'ప్రతి తరం మధ్య పిల్లలు–తల్లిదండ్రుల మధ్య భావోద్వేగ సంఘర్షణలు సహజం. మంచి సందేశంతో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. తక్కువ బడ్జెట్లోనూ మాట నిలబెట్టుకుని సినిమా పూర్తి చేయడం వెంకట్ రెడ్డి నిబద్ధతకు నిదర్శనం' అని అన్నారు.
దర్శకుడు సంజీవ్ కుమార్ మేగోటి మాట్లాడుతూ…'తండ్రి విలువను చూపించే ఇలాంటి సినిమాలు తీయడం నిజంగా సాహసం. ఈ సినిమాలో అశోక్ రెడ్డి తండ్రి పాత్రలో జీవించారు. పాటలు కూడా ఎంతో హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. వెంకట్ రెడ్డి కొద్ది సంవత్సరాల్లోనే 17 సినిమాలు పూర్తి చేయడం అభినందనీయం' అని అన్నారు. ఈ చిత్రంలో అశోక్ రెడ్డి లెంకల, తోట సుబ్బారావు, వి. కరుణాకర్, తన్నీరు నాగేశ్వరరావు, విజయలక్ష్మీ , వరేణ్య ఆగ్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ కుటుంబ కథాచిత్రంం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.


