సాక్షి, పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి జేడీయూ (JD-U) అధ్యక్షుడు నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నప్పటికీ బిహార్ అభివృద్ధి , పురోగతిపై తాను ఒక కన్నేసి ఉంచుతానని పేర్కొన్నారు. తన పార్టీ శాసనసభ్యులతో సమావే మైన సందర్భంగా ఆయన రాష్ట్ర అభివృద్ధి , పురోగతిపై తన పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉండాల్సిన సమయం మినహా, మిగిలిన గరిష్ట సమయాన్ని తాను బిహార్లోనే గడుపుతానని నితీష్ కుమార్ పార్టీ నేతలకు తెలిపారు. ప్రభుత్వ పనులను నిశితంగా పర్యవేక్షిస్తూ, రాష్ట అభివృద్దిపై దృష్టి పడతానని వ్యాఖ్యానించారు.
ప్రస్తుత ప్రభుత్వంలో జేడీయూ కీలక భాగస్వామిగా ఉన్నందున, గతంలో తాను ప్రారంభించిన మంచి పనులు కొనసాగేలా చూస్తానని, దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ఆయన పేర్కొన్నారు. మరోవైపు జేడీయూ శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకునే అధికారాన్ని ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా నితీష్ కుమార్కే అప్పగించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్), ఉప ముఖ్యమంత్రులు విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ తదితర కీలక నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కాన్పూర్ కవలల విషాదం, షాకింగ్ విషయాలు వెలుగులోకి
ఏప్రిల్ 10న రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, నితీష్ కుమార్ ఏప్రిల్ 14న బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ గత నెలలోనే జేడీయూలో చేరారు. అయితే, సామ్రాట్ చౌదరి ప్రభుత్వంలో మంత్రి పదవిని చేపట్టడానికి ఆయన నిరాకరించారు.నిశాంత్ను పార్టీ భవిష్యత్తు నాయకుడిగా అందరూ అంగీకరించారని, అయితే తాజా సమావేశంలో ఆయన పాత్ర గురించి ఎటువంటి చర్చ జరగలేదని జేడీయూ ప్రతినిధి నీరజ్ కుమార్ వెల్లడించారు.
ఇదీ చదవండి: అపుడు సస్పెన్షన్, ఇపుడు సీఎం యోగీ ఎలివేషన్, ఎవరీ దుర్గా శక్తి?


