డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు చెందిన ఉన్నతాధికారి అవినీతి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీజీసీఏలో పెండింగ్లో ఉన్న అనుమతులు మరియు ఆమోదాలను మంజూరు చేయడానికి లంచం డిమాండ్ చేసిన కేసు విచారణలో భాగంగా సీబీఐకి దిమ్మదిరిగే విషయాలు తెలిశాయి.
రూ. 2.5 లక్షల లంచం ఆరోపణలతో డీజీసీఏ ఎయిర్వర్దినెస్ డైరెక్టరేట్లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న అధికారిని, అలాగే ఒక ప్రైవేట్ కంపెనీ ప్రతినిధిని సిబీఐ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 18న కేసు నమోదు చేసిన సీబీఐ లంచం తీసుకుంటుండగా నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేసింది. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది.ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఢిల్లీలోని నాలుగు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సోదాల్లో లభించిన భారీ నగదు , ఆస్తులు చూసి అధికారులే విస్తుపోయారు.
ఇదీ చదవండి: విమానంలో సాంకేతికలోపం... హడలిపోయిన ప్రయాణీకులు
ఏకంగా రూ. 37 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా బంగారు, వెండి నాణేలను గుర్తించారు. వీటితోపాటు పలు ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు ఇతర డిజిటల్ పరికరాలను సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులపై లోతైన విచారణ కొనసాగుతోందని సిబిఐ అధికారులు తెలిపారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలను విశ్లేషించడం ద్వారా మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదీ చదవండి: కాన్పూర్ కవలల విషాదం, షాకింగ్ విషయాలు వెలుగులోకి


