సాక్షి, తాడేపల్లి/హైదరాబాద్: చంద్రబాబు, లోకేష్.. మీ బతుకంతా నాటకాలు, మోసాలే అని మండిపడ్డారు వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి. లోకేష్ మీ కుటుంబ చరిత్ర తెలుసుకో అంటూ హితవు పలికారు. కన్న తండ్రి ఎన్టీఆర్పై చెప్పులేసి అవమానిస్తుంటే.. మీ అమ్మ భువనేశ్వరి ఏనాడైనా మాట్లాడిందా? అని ప్రశ్నించారు. కుటుంబాలను చీల్చి మీరు ఏం సాధించలేరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సూచించిన మావిగన్ రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరం. మావిగన్పై కూటమి నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ ముందు నీ స్థాయి ఎంత లోకేష్?. నీ బిల్డప్ ప్రజలకు తెలియదని అనుకుంటున్నావా?. లోకేష్ ఈవీఎంల ద్వారా గెలిచారు. చంద్రబాబు, లోకేష్ మీ కుటుంబ చరిత్ర తెలుసుకోండి. చంద్రబాబు, లోకేష్ అడ్డదారుల్లో అమృతం తాగే రకం అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
అలాగే, లోకేష్.. ఏనాడైనా మీ మేనత్తలు మీ ఇంటికి వచ్చారా?. మీ మేనత్తలు అంటే మీ అమ్మకు ఎంతో రోత. అసలు వాళ్లు ఎక్కడ ఉన్నారో నీకు తెలుసా?. లోకేష్.. మీ కుటుంబం పట్ల.. మీకే ప్రేమాభిమానాలు లేవు. చంద్రబాబు, లోకేష్.. మీ బతుకంతా నాటకాలు, మోసాలే. లోకేష్.. ఏనాడైనా అమ్మమ్మ అంటూ నా దగ్గరికి వచ్చావా?. అసలు నా పుట్టినరోజు నీకు తెలుసా?. కన్న తండ్రిపై చెప్పులేసి అవమానిస్తుంటే.. మీ అమ్మ ఏనాడైనా మాట్లాడిందా?. కుటుంబాలను చీల్చి మీరు ఏం సాధించలేరు. కాంగ్రెస్లో మీ నాన్నే.. బీజేపీలో మీ నాన్నే ఉన్నారు కదా లోకేష్. చివరకు కమ్యూనిస్టుల్లోనూ చంద్రబాబే ఉన్నారని అన్నారు.
ఇదే సమయంలో వైఎస్సార్సీపీ హయాంలో మహిళల సంక్షేమం కోసం వైఎస్ జగన్ కృషి చేశారు. మహిళలకు వైఎస్ జగన్ 35 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చారని తెలిపారు. మంచి లీడర్ అంటే వైఎస్ జగన్లా ఉండాలి. చంద్రబాబు, లోకేష్ రాజకీయాలను చూసి ప్రజలే అసహ్యించుకుంటున్నారు అని విమర్శించారు.


