హార్మూజ్‌పై ఇరాన్‌ భారీ ట్విస్ట్‌.. దిమ్మ తిరిగే ప్లాన్‌! | Iran Govt New Act And Rule Implement On Hormuz, Details Here | Sakshi
Sakshi News home page

హార్మూజ్‌పై ఇరాన్‌ భారీ ట్విస్ట్‌.. దిమ్మ తిరిగే ప్లాన్‌!

Apr 20 2026 12:49 PM | Updated on Apr 20 2026 1:02 PM

Iran Govt New Act And Rule Implement On Hormuz, Details Here

టెహ్రాన్‌: ఇరాన్‌, అమెరికా మధ్య మాటల దాడి నడుస్తోంది. సై అంటే సై అని ఇరు పక్షాల నేతలు వాదించుకుంటున్నారు. యుద్ధం, దాడుల విషయంలో తగ్గేదేలే అంటూ ప్రతి సవాల్‌ చేసుకుంటున్నారు. రెండో దఫా చర్చలకు అమెరికా సిద్ధమైన వేళ ఇరాన్‌ చెక్‌ పెట్టింది. చర్చలకు వచ్చేది లేదని తేల్చి చెప్పింది. మరోవైపు.. హార్మూజ్‌ జలసంధిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. జలసంధి తెరవాల్సిందేనని ట్రంప్‌ పట్టుబడుతుంటే.. అదంతా జాంతా నై అని ఇరాన్‌ మొండి పట్టుతో ఉంది. ఇలాంటి తరుణంలో జలసంధిపై మరింత పట్టు బిగించాలని ఇరాన్‌ ప్లాన్‌ చేస్తోంది.

అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్‌ జలసంధిపై మరింత పట్టు కోసం ఇరాన్‌ ప్రణాళికలు, కొత్త చట్టాలను అన్వేషిస్తోంది. ఇప్పటి వరకు ఇరాన్‌కు నష్టం కలిగించిన ఇజ్రాయెల్‌ సహా పలు దేశాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్‌ సిద్దమైంది. జలసంధిపై నియంత్రణను కట్టుదిట్టం చేసే కొత్త చట్టాన్ని ఇరాన్‌ రూపొందించినట్లు తెలుస్తోంది. తాజాగా ఇరాన్ పార్లమెంటరీ సివిల్ ఇంజనీరింగ్ కమిటీ చైర్మన్.. ఈ మేరకు మహమ్మద్ రెజాయ్‌ కూచీ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలపై పూర్తి నిషేధంతో పాటు ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై కఠిన నిబంధనలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కొత్త ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేసిందన్నారు. ఈ ముసాయిదా చట్టం తుది రూపం దాల్చే దశకు చేరుకుందని వెల్లడించారు.

అలాగే, అతి త్వరలోనే దీనిని ఇరాన్‌ పార్లమెంట్‌ ఆమోదించనున్నట్లు తెలిపారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న నౌకలను హార్మూజ్‌ గుండా ప్రయాణించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తే లేదన్నారు. ఇరాన్‌ శత్రు దేశాలుగా పరిగణించే దేశాల నౌకలు ప్రయాణించాలంటే ఆ దేశ జాతీయ భద్రతా మండలి నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. గతంలో ఇరాన్‌కు నష్టం కలిగించిన దేశాల నౌకలు ఆ నష్టపరిహారాన్ని చెల్లించే వరకు జలసంధి గుండా ప్రయాణించడానికి వీలు లేదన్నారు. జలసంధి గుండా వెళ్లే నౌకలు తమ రవాణా రుసుమును కేవలం ఇరాన్ కరెన్సీలో చెల్లించాల్సి ఉంటుందని బాంబు పేల్చారు.

ఉచితం కాదు: ఇరాన్‌
ఇదే సమయంలో హార్మూజ్‌ జలసంధిలో నౌకల భద్రత ఉచితం కాదని ఇరాన్‌ ఉపాధ్యక్షుడు మహ్మద్‌ రెజా ఆరిఫ్ అన్నారు. ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ ప్రపంచ దేశాలు తమ నౌకల భద్రతను ఉచితంగా ఆశించడం కుదరదని తేల్చిచెప్పారు. తమ చమురు ఎగుమతులపై ఉన్న ఆర్థిక, సైనిక ఒత్తిడిని తొలగిస్తేనే ప్రపంచ చమురు ధరలు అదుపులోకి వస్తాయని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. అమెరికా చేస్తోన్న నౌకాదళ దిగ్బంధనం కొనసాగినంత కాలం జలసంధిలో సరఫరా పునరుద్ధరణ కష్టమని తేల్చి చెప్పారు. ఇప్పుడు ప్రపంచం ముందు రెండే దారులు ఉన్నాయి. అందరికీ స్వేచ్ఛా యుత చమురు మార్కెట్ ఉండాలి లేదంటే భారీ మూల్యాన్ని చెల్లించుకోవడానికి సిద్ధపడాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌ వ్యతిరేక దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

Advertisement
 
Advertisement
Advertisement