చదివే అవకాశంలోని కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినా..వెనకడుగు వేయలేదు. ఫీజు చెల్లించే పరిస్థితి లేకపోయినా..కూరగాయలు అమ్ముతూ చదువు సాగించాడు. అలా దేశ సేవ చేయాలని ఆర్మీలో చేరాడు. రిటైర్ అయ్యాక కూడా చదవాలనే కోరికను కొనసాగించాడు. ఆ ఆసక్తితో ఎన్ని డిగ్రీలు పూర్తి చేశాడో తెలిస్తే విస్తుపోతారు. పైగా అన్ని డిగ్రీలు పూర్తి చేసి ఎన్ని రికార్డులు నెలకొల్పాడో తెలిస్తే 'జయహో సైనికుడా' అని ప్రశంసించకుండా ఉండలేరు.
అతడే రాజస్థాన్లోని ఝున్ఝును జిల్లాలోని ఖిరోడ్ గ్రామానికి చెందిన దశరథ్ సింగ్. తన కుటుంబంలో అంతగా విద్యకు ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. ఎందుకంటే పూటగడవడమే కష్టం కావడంతో ఆ ఆలోచనే వచ్చేది కాదు. అయినా సరే ఆ ఆర్థిక ఇబ్బందులను తట్టుకుంటూ చదువు సాగించాడు. కానీ కాలేజీ చదువులకు ఫీజులు చెల్లించలేక స్వస్తి పలకాల్సి వచ్చింది. అయినా కూడా ఆశను వదులకోలేదు. పొలంలో పండిన కూరగాయలు అమ్మేందుకు ఏకంగా 13 కిలోమీటర్లు నడిచి మరి చదువుకి నిధులు సమకూర్చుకున్నాడు. ఆ తర్వాత భారత సైన్యంలో చేరి పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో పోస్టింగ్తో సహా 16 ఏళ్లు పనిచేశాడు.
సర్వీస్లో ఉన్నప్పుడు కూడా తన వార్షిక సెలవులను చదువు కోసం ఉపయోగించేవాడు. సైనిక విధులతో పాటు నిశ్శబ్దంగా బలమైన విద్యా పునాదిని నిర్మిచుకున్నాడు దశరథ్ సింగ్. ఇక 2004లో పదవీ విరమణతో సింగ్ తన చిరకాల ఆశయం నిజం చేసుకునే దిశగా అడుగులు వేసి..ఎవ్వరూ ఊహించన విధంగా వందలకొద్దీ డిగ్రీలు పూర్తి చేశాడు. మొత్తం తన జీవితాన్ని చదువుకే అంకితం చేశాడు. సుమారు 138 డిగ్రీలు పూర్తి చేశాడు.
తన విద్యా విజయాలు కారణంగా మొత్తం 11 ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. అలాగే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి సంస్థల నుంచి గుర్తింపు పొందాడు. వీటిలో చాలామటుకు డిగ్రీలు ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వంటి గుర్తింపు పొందిన సంస్థల నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పూర్తి చేశారు. చదవడానికి వయసుతో సంబంధం లేదని నిరంతర కృషి, అచంచలమైన పట్టుదల ఉంటే..నిరంతరాయంగా కొనసాగించవచ్చు అనడానికి ఈ మాజీ సైనికుడే ఉదాహరణ.


