భారత్‌కు అనూహ్య మద్దతు.. విమర్శలకు చెక్‌! | Finnish FM Valtonen strategic partnership With India | Sakshi
Sakshi News home page

భారత్‌కు అనూహ్య మద్దతు.. విమర్శలకు చెక్‌!

Jun 13 2026 9:22 AM | Updated on Jun 13 2026 10:43 AM

Finnish FM Valtonen strategic partnership With India

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై పాశ్చాత్య దేశాల నుంచి విమర్శలు వస్తున్న వేళ ఫిన్లాండ్ వేదికగా భారత్‌కు కీలక మద్దతు లభించింది. రష్యా చమురు విషయమై ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఎలినా మరియా వాల్టోనెన్ స్పందిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నట్లు నివేదికలు వెల్లడించాయి. దీంతో, భారత్‌కు అనూహ్య మద్దతు లభించినట్టు అయ్యింది.

ఫిన్లాండ్‌లో జరిగిన కుల్తరాంతా టాక్స్ (Kultaranta Talks) సదస్సులో విదేశాంగ మంత్రి జైశంకర్‌ పాల్గొన్నారు. ఈ క్రమంలో రష్యా చమురు దిగుమతులపై భారత వైఖరిని బలంగా సమర్థించగా, ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఎలినా భారత్ తీసుకున్న నిర్ణయాలకు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఎలినా మాట్లాడుతూ.. భారత్‌ నిర్ణయాలను వ్యతిరేకించే అవకాశం లేదు. ప్రపంచం ఇప్పుడు బహుళ ధ్రువ (Multipolar) వ్యవస్థ వైపు వెళ్తోంది. వివిధ దేశాలు తమ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయి. భారత్‌ వంటి ఎదుగుతున్న శక్తుల భద్రతా, ఇంధన అవసరాలను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అని అన్నారు. అలాగే, భారత్-ఫిన్లాండ్ సంబంధాలపై మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటలైజేషన్, సుస్థిర అభివృద్ధి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. భారత్‌తో ఫిన్లాండ్‌కు అద్భుతమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని, వాటిని మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా సదస్సులో ఓ పాత్రికేయుడు భారత్.. రష్యా పట్ల "అతి సానుభూతి" చూపుతోందని, భారీగా రష్యా చమురు కొనుగోలు చేస్తోందని ప్రశ్నించగా జైశంకర్ ఘాటుగా స్పందించారు. 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత యూరోపియన్ దేశాలే మధ్యప్రాచ్య చమురును పెద్దఎత్తున కొనుగోలు చేశాయని, దీంతో భారత్‌కు తక్కువ ధరలో లభ్యమైన రష్యా చమురే ఆచరణాత్మక ప్రత్యామ్నాయంగా మారిందని వివరించారు. అంతేకాకుండా, యూరప్‌లో తయారైన ఆయుధాలు ఎన్నో ఏళ్లుగా భారత్‌పై దాడులకు ఉపయోగించబడ్డాయి. కానీ భారత్ ఎప్పుడూ యూరప్ భద్రతకు ముప్పు కలిగించే పని చేయలేదు అంటూ పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరిని ఎత్తిచూపారు.

మరో కీలక అంశాన్ని కూడా జైశంకర్ వెల్లడించారు. రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను స్థిరీకరించేందుకు భారత్, రష్యా చమురు కొనుగోలు చేయాలని అమెరికానే కోరిందని చెప్పారు. ప్రస్తుతం అదే దేశాలు భారత్‌ను విమర్శించడం విరుద్ధ వైఖరికి ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. భారత్ తన ఇంధన భద్రత, ప్రజల అవసరాలు, ధరల నియంత్రణను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుందని, విదేశీ ఒత్తిళ్ల కంటే జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుందని జైశంకర్ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement