సౌతిండియాలో మణిరత్నం తర్వాత పూరీనే! | Rogue Audio Launched | Sakshi
Sakshi News home page

సౌతిండియాలో మణిరత్నం తర్వాత పూరీనే!

Mar 14 2017 12:21 AM | Updated on Sep 5 2017 5:59 AM

సౌతిండియాలో మణిరత్నం తర్వాత పూరీనే!

సౌతిండియాలో మణిరత్నం తర్వాత పూరీనే!

పాతిక సినిమాలు తీస్తే... అన్నిటికీ కథ, మాటలు సొంతంగా రాసుకున్న దర్శకులు సౌతిండియాలో ఇద్దరే ఇద్దరున్నారు.

– వీవీ వినాయక్‌
‘‘పాతిక సినిమాలు తీస్తే... అన్నిటికీ కథ, మాటలు సొంతంగా రాసుకున్న దర్శకులు సౌతిండియాలో ఇద్దరే ఇద్దరున్నారు. ఒకరు.. మణిరత్నం. ఆయన తర్వాత సౌతిండియాలో జగ్గూభాయ్‌ (పూరి జగన్నాథ్‌) ఒక్కడే. ‘టెంపర్‌’ తప్ప జగ్గూభాయ్‌ తీసిన ప్రతి సినిమా కథ, మాటలు ఆయనవే. నిజమైన దర్శకుడతను’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్‌. ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో సీఆర్‌ మనోహర్, సీఆర్‌ గోపీ నిర్మించిన సినిమా ‘రోగ్‌’. సునీల్‌ కశ్యప్‌ స్వరాలందించిన ‘రోగ్‌’ ఆడియో సోమవారం విడుదలైంది. హిందీ నటుడు అర్భాజ్‌ఖాన్‌ ఆడియో సీడీలను ఆవిష్కరించి, వీవీ వినాయక్‌కు అందజేశారు.

అనంతరం వినాయక్‌ మాట్లాడుతూ
‘‘తమ్ముణ్ణి హీరోగా లాంచ్‌ చేయాలని పూరి కోసం సీఆర్‌ మనోహర్‌గారు రెండేళ్లు ఎదురు చూశారు. ఆయన ఎందుకు వెయిట్‌ చూశారో.. ట్రైలర్‌ చూస్తే తెలుస్తుంది. జగ్గూభాయ్‌ వయసులో వెనక్కి వెళ్లుంటాడు. ఎవరో కొత్త కుర్రాడు సినిమా తీసినట్టుంది. ఇషాన్‌ పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ
‘‘నేను ‘బద్రి’ డైరెక్ట్‌ చేస్తున్నప్పుడు నిర్మాత త్రివిక్రమ్‌రావుగారికి ఎలా చేస్తానోననే టెన్షన్‌ ఉండేది. ఫస్ట్‌డే ప్యాకప్‌ చెప్పిన తర్వాత ‘50 సినిమాలు తీస్తావ్‌’ అన్నారు. ఆల్రెడీ 33 తీశా. అప్పుడాయన ఎంత నమ్మకంతో చెప్పారో... నేనూ అంతే నమ్మకంతో చెబుతున్నా. ఇషాన్‌ 50 సినిమాలు చేస్తాడు. సునీల్‌ కశ్యప్‌ మంచి మెలోడీలు ఇచ్చాడు’’ అన్నారు.

సీఆర్‌ మనోహర్‌ మాట్లాడుతూ
‘‘పూరిగారి చేతుల్లో పడడం ఇషాన్‌ అదృష్టం. ఇషాన్‌ మా బాబాయ్‌ కుమారుడు. ‘మా అన్నయ్య డబ్బులు పెడుతున్నాడు, హీరోగా ఏదో ఒకటి చేసేద్దాం’ అని రాలేదు. చాలా కష్టపడ్డాడు’’ అన్నారు.

ఇషాన్‌ మాట్లాడుతూ 
‘‘ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో... నాకు ఇంత మంచి అన్నయ్యలు, ఫ్యామిలీ దొరికింది. అందరూ నేను సూపర్‌స్టార్‌ అవుతానంటున్నారు. తప్పకుండా ఏదొక రోజు సూపర్‌స్టార్‌ అయ్యి, మా ఫ్యామిలీ పేరు నిలబెడతా’’ అన్నారు. ‘‘హీరోలను ఇంట్రడ్యూస్‌ చేయాలంటే రాఘవేంద్రరావుగారి తర్వాత పూరిగారే. తమిళంలో ఈ సినిమాను నేనే రిలీజ్‌ చేస్తున్నా’’ అన్నారు ఏఎం రత్నం. ఈ వేడుకలో సన్నీ లియోన్‌ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్మాతలు ‘భవ్య’ ఆనంద్‌ప్రసాద్, పీవీపీ, దర్శకుడు క్రిష్, హీరో రామ్‌శంకర్, ఆకాశ్‌ పూరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement