మన తప్పుకు మనదే బాధ్యత

Rakul Preet Singh to romance Arjun Kapoor  - Sakshi

బాలీవుడ్‌ ట్రాక్‌పై స్పీడ్‌ పెంచుతున్నట్లున్నారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఈ ఏడాది ‘దే దే ప్యార్‌ దే’ చిత్రంతో సూపర్‌ సక్సెస్‌ను అందుకున్న రకుల్‌ ఈ నెల 15న విడుదల కానున్న ‘మర్జావాన్‌’ చిత్రంలో నటించారు. ఇటీవలే అర్జున్‌కపూర్‌కు జోడీగా మరో హిందీ చిత్రానికి ఓకే చెప్పారు. తన బాలీవుడ్‌ కెరీర్‌ గురించి రకుల్‌ మాట్లాడుతూ– ‘‘దక్షిణాదిలో పాతిక చిత్రాలు పూర్తి చేశాను. నటిగా నన్ను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇప్పుడు బాలీవుడ్‌పై కూడా కొంచెం దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను.

అలాగని దక్షిణాది సినిమాలు చేయనని కాదు. కథ, అందులోని నా పాత్రను బట్టి సినిమా చేయాలా? వద్దా అని నిర్ణయించుకుంటాను. కెరీర్‌ ఆరంభంలో మాత్రమే కాదు.. మరో స్థాయికి ఎదుగుతున్నప్పుడు కూడా సరైన నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే కెరీర్‌ తడబడుతుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకుని వేరే వారిని నిందించడం తగదు. మన తప్పుకు మనదే  బాధ్యత. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ప్రస్తుతం హిందీలో మరో మూడు ప్రాజెక్ట్స్‌ గురించి చర్చలు జరుగుతున్నాయి. త్వరలో వెల్లడిస్తా’’ అని పేర్కొన్నారు.

వేడుకకు రారండోయ్‌
ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు ఈ నెల 20 నుంచి 28 వరకు గోవాలో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో పాల్గొనమని ఐఎఫ్‌ఎఫ్‌ఐ నుంచి రకుల్‌కు ఆహ్వానం అందింది. ప్రస్తుతానికి రకుల్‌తో పాటు విజయ్‌ దేవరకొండ, నిత్యా మీనన్, రష్మికా మందన్నాలకు కూడా పిలుపొచ్చింది. జీవన శైలి, కెరీర్‌ జర్నీ తదితర అంశాలపై వీరు ప్రసంగించనున్నారు. సూపర్‌స్టార్లు రజనీకాంత్, అమితాబ్‌బచ్చన్‌ కలిసి ఈ వేడుక ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top