కన్ఫర్మ్‌: రాజమౌళి నెక్స్ట్‌ రెండు సినిమాలు ఇవే!

Rajamouli Sets Next Two Films - Sakshi

'బాహుబలి' సినిమాల భారీ విజయం తర్వాత దర్శకధీరుడు రాజమౌళి.. ఏ సినిమా తీయబోతున్నారన్నది తీవ్ర ఆసక్తి రేపుతోంది. 'బాహుబలి' సిరీస్‌తో అంతర్జాతీయంగా పాపులర్‌ అయిన రాజమౌళి తాను తీయబోయే తదుపరి రెండు చిత్రాల గురించి క్లారిటీ ఇచ్చారు. అంతర్జాతీయ మ్యాగజీన్‌ 'వెరీటీ'కి ఇంటర్వ్యూ ఇచ్చిన రాజమౌళి.. తన తదుపరి సినిమాలను కన్ఫర్మ్‌ చేశారు.

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబుతో సినిమా తీయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రముఖ నిర్మాత కేఎల్‌ నారాయణ తెరకెక్కించే ఈ సినిమా 2019లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. 'క్షణ క్షణం', 'హాలోబ్రదర్‌', 'రాఖీ' వంటి ప్రముఖ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన కేఎల్‌ నారాయణ నిర్మించే ఈ సినిమా టైటిల్‌, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ లోపే డీవీవీ దానయ్యతో సినిమా తీస్తానని రాజమౌళి స్పష్టం చేశారు. 'బాహుబలి' సిరీస్‌ తర్వాత వెంటనే తీయబోయే సినిమా ఇదే కానుంది. 'దానయ్యకు నేను కమిట్‌ అయ్యాను. ఇదే నా నెక్స్ట్‌ సినిమా కానుంది' అని రాజమౌళి స్పష్టం చేశారు. 'ఏ భాషలో ఈ సినిమాను నిర్మించనున్నాం. ఈ చిత్రంలో నటీనటులు ఎవరు? అన్నది ఇంకా తెలియదు' అని ఆయన చెప్పారు. డీవీవీ దానయ్య ప్రస్తుతం మహేశ్‌బాబుతో 'భరత్‌ అను నేను' సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అనంతరం రాజమౌళితో సినిమాను దానయ్య సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశముంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top