రాగల 24 గంటల్లో...

Ragala 24 Gantallo First Look Launch - Sakshi

‘‘రేడియోల్లో, టీవీల్లో రాగల 24 గంటల్లో అని వాతావరణం విషయాలను చెప్పేవారు. అయితే మా ‘రాగల 24 గంటల్లో’ కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి.. అవి ఏంటి? అన్నదే సస్పెన్స్‌’’ అని దర్శకుడు శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సత్యదేవ్, ఈషా రెబ్బ, గణేష్‌ వెంకట్రామన్, ముస్కాన్‌ సేథీ ముఖ్య తారలుగా, హీరో శ్రీరామ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వంలో శ్రీ నవహాస్‌ క్రియేషన్స్‌ పతాకంపై శ్రీనివాస్‌ కానూరు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ కామెడీ, ఎంటర్‌టైనర్‌ చిత్రాలను తెరకెక్కించిన నేను మొదటి సారి థ్రిల్లర్‌ సినిమా చేశాను. ఇందులోనూ వినోదం మిస్‌ అవ్వదు. అందరి పాత్రలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి.

జూలైలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సత్యదేవ్‌. ‘‘ఈ సినిమాలో నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్ర చేశా’’ అని ఈషారెబ్బా అన్నారు. ‘‘ఇది పూర్తిస్థాయి సీరియస్‌ సినిమా కాదు.. ఆద్యంతం నవ్వులు పండిస్తూనే అందరిలో ఆసక్తి రేపుతుంది’’ అని శ్రీరామ్‌ అన్నారు. ‘‘షూటింగ్‌ పూర్తి కావొచ్చింది. విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని కానూరు శ్రీనివాస్‌ తెలిపారు. గణేష్‌ వెంకట్రామన్, నటుడు కృష్ణ భగవాన్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె, కెమెరా: అంజి, సమర్పణ:  శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్‌.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top