వందమందితో డిష్యూం డిష్యూం

Prabhas shoots an action climax scene with 100 fighters for Saaho - Sakshi

ప్రభాస్‌ కటౌట్‌ ఆరడుగులు ఉంటుంది. ఇలాంటి బలమైన హీరోని ఎదుర్కోవాలంటే ఒకరిద్దరు విలన్లు కచ్చితంగా సరిపోరు. డజన్ల కొద్ది రౌడీలు రావాల్సిందే. ‘సాహో’ సినిమా క్లైమాక్స్‌లో ఏకంగా వందమందికి పైగా కరుడుగట్టిన రౌడీలతో ప్రభాస్‌ తలపడతారని తెలిసింది. ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్‌ చిత్రం ‘సాహో’. సుమారు 300 కోట్ల బడ్జెట్‌తో వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మించారు. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. ‘సాహో’ క్లైమాక్స్‌ను దాదాపు వందమంది ఫైటర్స్‌తో చిత్రీకరించారట.

ఈ సన్నివేశం కోసం అబుదాబిలో ప్రత్యేకంగా సెట్‌ను రూపొందించారు. పది ఎకరాలలో ఓ ఎడారి, అందులో పాడుబడిన భవంతిని తలపించే సెట్‌ను తయారు చేశారు. ఎడారి లుక్‌ పర్ఫెక్ట్‌గా సెట్‌ కావడం కోసం సెట్‌ మొత్తాన్ని నల్ల మట్టితో నింపారని సమాచారం. పెంగ్‌ జాంగ్‌ ఈ ఫైట్‌ని కంపోజ్‌ చేశారు. ఈ ఫైట్‌ కోసం భారీగా ఖర్చుపెట్టారట. జాకీ ష్రాఫ్, అరుణ్‌ విజయ్, మురళీ శర్మ, మందిరా బేడీ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మది కెమెరామేన్‌గా చేశారు. ముందు ఈ చిత్రం ఆగస్ట్‌ 15న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే వాయిదాపడిందని సమాచారం.  ‘సాహో’ రిలీజ్‌ డేట్‌పై స్పష్టత రావాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top