‘తిరుమలకు వెళ్లిన అనుభూతి కలిగింది’ | Om Namo Venkateshaya Tamil Dubbing Special Screening | Sakshi
Sakshi News home page

Dec 10 2017 8:22 AM | Updated on Jul 15 2019 9:21 PM

Om Namo Venkateshaya Tamil Dubbing Special Screening - Sakshi

తమిళసినిమా: తిరుమల వెళ్లి వేంకటేశ్వరుని దర్శించుకున్నంత అనుభూతి కలిగిందని సీనియర్‌ నటుడు శివకుమార్‌ పేర్కొన్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఆయన బ్రహ్మాండనాయగన్‌ చిత్రాన్ని చూసి అలా ప్రశంసించారు. బ్మహ్మాండ నాయగన్‌ చిత్రం అంటే మరేదో కాదు. తెలుగులో నాగార్జున, అనుష్క ప్రధాన పాత్రలు పోషించిన ఓం నమోవేంకటేశాయ చిత్రమే. శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు మరో భక్తిరస బ్రహ్మాండ సృష్టే ఈ చిత్రం.

శ్రీవేంకటేశ్వరస్వామి పరమ భక్తుడైన హథీరాంబాబాగా నాగార్జున నటించిన ఈ చిత్రంలో ఆ దేవదేవుని భక్తురాలు ఆండాళ్‌గా అనుష్క నటించారు. కీరవాణి సంగీతాన్ని అందించిన ఇందులో 12 గీతాలు చోటు చేసుకున్నాయి. ఈ చిత్రం ఇప్పుడు తమిళ ప్రేక్షకుల ముందుకు బ్రహ్మాండనాయగన్‌ పేరుతో రానుంది. జ్యోషిక ఫిలింస్‌ సంస్థ తమిళంలోకి అనువదించిన ఈ చిత్రాన్ని స్టార్‌ బాక్స్‌ సంస్థ విడుదల హక్కులను పొంది త్వరలో విడుదలకు సన్నాహాల చేస్తోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు చిత్రాన్ని సీనియర్‌ నటుడు శివకుమార్‌కు ప్రత్యేకంగా ప్రదర్శించారు. చిత్రం చూసిన ఆయన చిత్రం నిజంగానే బ్రహ్మాండంగా ఉందని, శ్రీవేకటేశ్వరునికి ఆయన భక్తుడికి మధ్య జరిగిన యథార్థ సంఘటనలను చూసి తరించవచ్చునని పేర్కొన్నారు. ఈ చిత్రం చూసిన తరువాత మనసు భక్తి పరవశంతో పొంగిపోయిందన్నారు. తిరుపతి, తిరుమలలోని వెంకన్నను దర్శించుకున్న అనుభూతి కలిగిందని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement