పెళ్లిళ్లు, శుభకార్యాలున్నా... ప్రేక్షకులు థియేటర్లకొచ్చారు!

Mental Madhilo Movie Success Meet - Sakshi

‘‘ఈ నాలుగు రోజుల్లో బోల్డన్ని పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్నాయి. అయినా... ప్రేక్షకులు సినిమాను చక్కగా ఆదరిస్తున్నారు. 80 శాతం థియేటర్లు ఫుల్‌ అవుతున్నాయి. హ్యాపీగా ఉంది’’ అని నిర్మాత రాజ్‌ కందుకూరి అన్నారు. శ్రీవిష్ణు, నివేతా పేతురాజ్‌ జంటగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘మెంటల్‌ మదిలో’ శుక్రవారం విడుదలైంది. డి. సురేశ్‌బాబు సమర్పకులుగా వ్యవహరించిన ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ శనివారం జరిగింది. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘ఫస్ట్‌ కాపీ రాగానే సురేశ్‌బాబుగారు 10రోజులు స్పెషల్‌ షోలు వేయమని చెప్పారు.

ఆయన కాన్ఫిడెన్స్‌కి థ్రిల్లయ్యా. ఆ పది రోజులూ ఐసీయులో పేషెంట్‌ ఎలా ఉన్నాడని ఆరా తీసినట్టు... టెన్షన్‌ పడేవాణ్ణి. ప్రేక్షకులు సినిమాను ఆదరించడంతో హ్యాపీగా ఉంది. వివేక్‌ లాంటి దర్శకులు ఎక్కువమంది ఉన్నా... రాజ్‌ కందుకూరి వంటి నిర్మాత ఒక్కరే ఉన్నారు. ఇటువంటి సినిమాలను ఆదరిస్తే... ఎక్కువమంది రాజ్‌ కందుకూరిలు ఇండస్ట్రీకి వస్తారు’’ అన్నారు. ‘‘సినిమా విడుదలకు ముందు సురేశ్‌బాబుగారు అందించిన సహకారం మరువలేనిది.

శ్రీవిష్ణు, శివాజీరాజా (హీరో తండ్రి పాత్ర) ఇద్దరూ మా సినిమాలో హీరోలే. శ్రీవిష్ణు కోసం అతిథి పాత్రలో నటించిన నారా రోహిత్‌గారికి థ్యాంక్స్‌. మా టీమ్‌ అందరూ ఎంతో సపోర్ట్‌ చేశారు’’ అన్నారు రాజ్‌ కందుకూరి. ‘‘రోజా రమణిగారు ‘ఇన్నేళ్ల నా అనుభవంలో సినిమా చూసి, ఓ క్యారెక్టర్‌ ఆర్టిస్టుకి కాల్‌ చేయడం ఇదే తొలిసారి’ అన్నారు. అంతకంటే గొప్ప అభినందన ఏముంటుంది’’ అన్నారు శివాజీ రాజా. ఈ కార్యక్రమంలో దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి, నటి అనితా చౌదరి, సంగీత దర్శకుడు ప్రశాంత్‌ విహారి తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top