
సాక్షి, సినిమా : నటుడు మాధవన్కు అరుదైన గౌరవం దక్కింది. కెనడా ప్రభుత్వం తమ పార్లమెంట్ను సందర్శించాల్సిందిగా ఆయనను ఆహ్వానించింది. ఇంకేం ఊహించని ఆ పిలుపునకు స్పందించిన మాధవన్ రయ్ మంటూ అక్కడ వాలిపోయాడు.
ఒట్టావాలో మన నటుడికి ఘన స్వాగతమే లభించింది. ఇండో-కెనెడియన్ మంత్రులైన బర్దిష్ చగ్గెర్, నవదీప్ బెయిన్స్ మాధవన్కు దగ్గరుండి ఆయన్ని పార్లమెంట్కు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని భారత హై కమిషనర్ వికాస్ స్వరూప్ తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశారు. లైబ్రరీ హాల్, సెనేట్ ఇలా మొత్తం పార్లమెంట్ను చక్కర్లు కొట్టిన మాధవన్ అక్కడి ప్రముఖులతో సరదాగా ఫోటోలు దిగి తన సోషల్ మీడియాలో అకౌంట్లలో పోస్ట్ చేశాడు.
అందులో ఏకంగా హౌజ్ ఆఫ్ కామన్స్ స్పీకర్ చెయిర్లో కూర్చున్న మాధవన్ ఫోటో మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచింది. మాధవన్కు ఇచ్చిన ఆతిథ్యం గురించి కెనెడా మంత్రి షాంపైన్ ఎప్పటికప్పుడు విశేషాలు అందించగా.. అందుకు మాధవన్ కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో షాంపైన్ నేతృత్వంలోని ఓ బృందం వాణిజ్య ఒప్పందాల కోసం ముంబై రానుంది. ఈ నేపథ్యంలో వారిని మరోసారి కలుస్తానని మాధవన్ చెప్పారు. అన్నట్లు ఈ సీనియర్ నటుడు నాగ చైతన్య సవ్యసాచితో టాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతున్నట్లు ఆ మధ్య చెప్పకున్నాం.