సీఎం రేవంత్తో కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్ భేటీ
మెట్రో రైలు విస్తరణ, మూసీ పునరుజ్జీవంపై చర్చ
కెనడాకు రావాలని రేవంత్కు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సౌర విద్యుదుత్పాదక, హరిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కెనడా సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి కోరారు. భారత్లో కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్ బుధవారం రేవంత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కెనడా–తెలంగాణ మధ్య వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణల విషయంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే అంశంపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రేవంత్ చెప్పారు. ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లో తమ క్యాంపస్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.
కెనడాలోని విశ్వవిద్యాలయాలూ హైదరాబా ద్లో మల్టీ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటుకు పరిశీలించాలని కోరారు. పెట్టుబడులు, వ్యాపార భాగస్వాములకు తెలంగాణ మంచి వేదికగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. సీఎం నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందం కెనడాకు రావాలని కూటర్ ఆహ్వానించారు. డిసెంబర్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో సదస్సుకు కెనడా కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యాసంస్థలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
అన్నివిధాలుగా సహకరిస్తాం: కూటర్
మూసీ పునరుజ్జీవం, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల్లో కెనడా భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై రేవంత్, కూటర్ చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు కెనడా అన్నివిధాలుగా సహకరిస్తుందని కూటర్ హామీ ఇచ్చారు. తెలంగాణ–కెనడా మధ్య పారిశ్రామిక, ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని, ఫిరాన్ టెక్నాలజీ గ్రూప్ హైదరాబాద్లో తయారీ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయించడం, సీఐబీసీ హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ప్రారంభించడం వంటి పరిణామాలు రాష్ట్రంపై కెనడా కంపెనీల నమ్మకానికి నిదర్శనమని కూటర్ అన్నారు. సీపీపీ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ హైదరాబాద్కు చెందిన కంట్రోల్ఎస్(సీటీఆర్ఎల్ఎస్) డేటా సెంటర్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుని ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు.


