పులికేసికి లైన్‌ క్లియర్‌? | Line Clear To Vadivelu Pulikesi Movie | Sakshi
Sakshi News home page

పులికేసికి లైన్‌ క్లియర్‌?

Jun 25 2018 8:14 AM | Updated on Jun 25 2018 8:14 AM

Line Clear To Vadivelu Pulikesi Movie - Sakshi

వడివేలు

తమిళసినిమా: ఇంసైఅరసన్‌ 24ఆమ్‌ పులికేసి చిత్రానికి లైన్‌క్లియర్‌ అయ్యిందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. హాస్య నటుడు వడివేలును హీరోగా పరిచయం చేసి స్టార్‌ దర్శకుడు శంకర్‌ తన ఎస్‌.ప్రొడక్షన్‌ పతాకంపై నిర్మించిన చిత్రం ఇంసైఅరసన్‌ 23ఆమ్‌ పులికేసి.శంకర్‌ శిష్యు డు శింబుదేవన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీంతో వడివేలుకు హీరోగా అవకాశాలు వచ్చేశాయి. అయితే ఆ తరువాత నటించిన చిత్రాలేవీ సక్సెస్‌ కాలేదు. అదే సమయంలో రాజకీయ వివాదాల్లో చిక్కుకున్న వడివేలు నటనకు దూరం అయ్యారు. చాలా గ్యాప్‌ తరువాత దర్శకుడు శంకర్‌ మరోసారి వడివేలుకు అవకాశం కల్పించి ఇంసై అరసన్‌కు సీక్వెల్‌గా ఇంసైఅరసన్‌ 24ఆమ్‌ పులికేసి చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అయ్యారు. అయితే చిత్రం సగంలోనే ఆగిపోయింది. కారణం వడివేలు కాల్‌షీట్స్‌ కేటాయించకపోవడమే. దీంతో శంకర్‌ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఈ వివాదం కొంత కాలంగా సాగుతూ వస్తోంది.

నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ వడివేలుతో సమావేశమై సమస్యను పరిష్కరించడానికి కృషిచేస్తున్నారు. అయినా వడివేలు తన కాల్‌షీట్స్‌ను ఇంసైఅరసన్‌ 24ఆమ్‌ పులికేసి చిత్ర యూనిట్‌ సరిగా వాడుకోకుండా వృథా చేశారని, ఇంకా ఆ చిత్రానికి డేట్స్‌ కేటాయించలేనని చెప్పేశారు. తాను మళ్లీ ఆ చిత్రం చేయాలంటే అదనంగా పారితోషికం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దీంతో శంకర్‌ తరఫున తాము ఈ చిత్రం కోసం భారీ సెట్స్‌ వేసి కొంత భాగం చిత్రీకరించడంతో సుమారు రూ.9 కోట్లు ఖర్చు చేసినట్లు, ఆ మొత్తాన్ని వడివేలు తమకు చెల్లించేలా చర్యలు చేపట్టాలని నిర్మాతల మండలిని కోరారు. ఇదే విషయాన్ని వడివేలుకు నిర్మాతల మండలి ఆదేసించింది. ఇలాంటి పరిస్థితుల్లో వడివేలు ఇంసైఅరసన్‌ 24ఆమ్‌ పులికేసి చిత్రాన్ని పూర్తి చేసే తీరాల్సిన పరిస్థితి నెలకొందని సినీ వర్గాల సమాచారం. అదే విధంగా ఆయన చిత్రం చేయడానికి ఒప్పుకున్నట్లు తాజా టాక్‌. ఇదే గనుక నిజం అయితే ఇంసైఅరసన్‌ 24ఆమ్‌ పులికేసి త్వరలోనే మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉందన్నమాట.

Advertisement
 
Advertisement
Advertisement