ఆ సన్నివేశాల్లో అలా నటించలేను!

Keerthy Suresh Clarify On Liplock Scenes Acting - Sakshi

తమిళసినిమా: నడిగైయార్‌ తిలగం (మహానటి) చిత్రానికి ముందు ఆ తరువాత అన్న విధంగా మారింది నటి కీర్తీసురేశ్‌ రేంజ్‌. అంతకు ముందు ఈ బ్యూటీకి విజయాలు లేక కాదు. అయితే నడిగైయార్‌ తిలగం చిత్ర విజయం కీర్తీసురేశ్‌ కెరీర్‌లో ఒక మకుటంగా నిలిచిపోతుందన్నది అతిశయోక్తి కాదు. ప్రస్తుతం కీర్తీ స్టార్‌ హీరోయిన్‌ అంతస్తుకు చేరుకుంది. ఇప్పుడామె విజయ్‌తో సర్కార్, విశాల్‌కు జంటగా సండైకోళి–2, విక్రమ్‌కు సరసన సామి సీక్వెల్‌ చిత్రాల్లో నటిస్తోంది. ఈ మూడు కమర్శియల్‌ అంశాలతో కూడిన భారీ చిత్రాలే కావడం, అన్నీ చిత్ర నిర్మాణాలు చివరి దశకు చేరుకోవడం విశేషం. కాగా తాజాగా ఎన్‌టీఆర్‌ బయోపిక్‌గా తెరకెక్కుతున్న చిత్రంలో మరోసారి సావిత్రిగా నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరును సంపాదించుకున్న కీర్తీసురేశ్‌ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ చిత్రపరిశ్రమలో తనకుంటే రూపవతులు, అభినయవతులు చాలా మంది ఉన్నారని అంది. అయినా తనకు మంచి కథా పాత్రలు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంది. అదృష్టంపై తనకు అపార నమ్మకం ఉందని, అదే సమయంలో ప్రతిభ చాలా అవసరం అవుతుందని పేర్కొంది. సావిత్రి కథా పాత్రలో నటించిన తరువాత తనకు మంచి కథా పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నాయని చెప్పింది. అదే విధంగా  కథా పాత్రలనే ఎంచుకోవడంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపింది. కథలు విన్నప్పుడే అందులో నటించవచ్చు అని మనసు చెబితే ఆ చిత్రాలను అంగీకరిస్తున్నట్లు చెప్పింది. తనకు ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇష్టం లేదని అంది. అలాంటి సన్నివేశాలతో కూడిన కొన్ని అవకాశాలు తనకు వచ్చాయని, తాను ముద్దు సన్నివేశాల్లో నటించనని తెగేసి చెప్పడంతో ఆ అవకాశాలు పోయాయని చెప్పింది. తనకు సౌకర్యంగా లేని కథా పాత్రల్లో ఎప్పటికీ నటించనని తెలిపింది. కొన్ని సన్నివేశాలు కథకు అవసరమైనా కూడా తాను నటించనని, ముఖ్యంగా తనకు సిగ్గు ఎక్కువని, అందుకే ముద్దు సన్నివేశాల్లో సహజంగా నటించడం తనకు రాదని కీర్తీసురేశ్‌ పేర్కొంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top