నాలుగోసారి కూడా పాజిటివ్‌.. ఆందోళనలో కుటుంబం | Sakshi
Sakshi News home page

నాలుగోసారి కూడా పాజిటివ్‌.. ఆందోళనలో కుటుంబం

Published Sun, Mar 29 2020 3:15 PM

Kanika Kapoor Tests Positive For Coronavirus Fourth Time - Sakshi

లక్నో : కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు బాలీవుడ్‌ సింగర్‌ కనికా కపూర్‌. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపించడంలేదు. నాలుగోసారి నిర్వహించిన కరోనా పరీక్షల్లో కూడా ఆమెకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  కనికా 10 రోజుల నుంచి చికిత్స తీసుకుంటున్నప్పటికీ కరోనా బారి నుంచి బయటపడకపోవడం తమను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందని ఆమె కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలిపారు. ప్రస్తుతం విమాన సర్వీసులు కూడా నిలిచిపోవడంతో.. మెరుగైన చికిత్స కోసం కనికాను ఎక్కడికి తరలించలేకుండా ఉన్నామని తెలిపారు. కనికా కోలువాలని భగవంతున్ని ప్రార్థించడం ఒక్కటే ప్రస్తుతం తాము చేయగలిగిన పని అని అన్నారు. 

అయితే కనికా పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, అంతకుముందు మార్చి 9న లండన్‌ నుంచి తిరిగివచ్చిన  కనికా కపూర్‌ ఉత్తరప్రదేశ్‌లోని హోటల్‌లో బస చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను ఆమె కలిశారు. అదే సమయంలో ఆమెకు కరోనా సోకినట్లు వెల్లడి కావడంతో కలకలం రేగింది. దీంతో ఆమెను కలిసిన పలువురు ప్రముఖులు కూడా సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. మరోవైపు కరోనాపై ప్రభుత్వం జారీచేసిన నిబంధనలు పాటించనందుకు, కరోనా సోకినా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కనికాపై పోలీసులు కేసు నమోదు కూడా చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement