ట్రెండ్ ఫాలో అవడం నిన్నటి మాట. ట్రెండ్ సెట్ చేయడం నేటి మాట. నేటి తరం యువకథా నాయికలు రెండో కోవలో పయనిస్తున్నారు.
ట్రెండ్ ఫాలో అవడం నిన్నటి మాట. ట్రెండ్ సెట్ చేయడం నేటి మాట. నేటి తరం యువకథా నాయికలు రెండో కోవలో పయనిస్తున్నారు. ఇప్పుడీ వర్గం మధ్య ఆధిపత్య పోరు పెరుగుతోందని చెప్పవచ్చు. చిత్రాల ట్రెండ్ మారుతున్నట్లే హీరోయిన్ల ట్రెండ్ మార్పు వస్తోంది. కోలీవుడ్లో ఒకప్పుడు కథానాయికలు కుటుంబ కథా పాత్రల్లో నటిస్తే రిలాక్స్ కోసం క్లబ్డాన్స్ లాంటి పాటలకు శృంగార తారలతో నటింప చేసేవారు. ఈ తరహా పాటలన్నీ క్రమేణా హీరోయిన్లే చేయడం మొదలెట్టారు. దీంతో వారి ట్రెండ్ మారుతూ వచ్చింది. నటి అంబిక, రాధ, ఖుష్భు, గౌతమి, భానుప్రియ, రంభ, నగ్మ వంటి కథానాయికలు అటు కుటుంబ కథా పాత్రల్లోనూ ఇటు గ్లామరస్ పాత్రల్లోనూ మెప్పిస్తూ వచ్చారు.

అలాంటి తరుణంలో సుకన్య, దేవయాని, జ్యోతిక, స్నేహ, భావన వంటి నటీమణులు కాస్త గ్లామర్కు దూరంగా ఉంటూ ఫ్యామిలీ ఇమేజ్ను పొందారు. ఆ తరువాత తరం సిమ్రాన్, అసిన్, నయనతార, పూజా వంటి వారు హోమ్లీ, గ్లామర్ పాత్రల్లో మెప్పించారు. పాత్రల స్వరూపాన్ని బట్టి వారి అభినయం మారుతుండేది. అయితే ఆ తరువాత తరంగా చెప్పే త్రిష, అనుష్క, శ్రీయ, తమన్న, శృతిహాసన్, కాజల్ అగర్వాల్, హన్సిక, సమంత, అమలాపాల్, తాప్సీ, లక్ష్మీరాయ్, ప్రియా ఆనంద్, పూర్ణ వంటి హీరోయిన్లు కోలీవుడ్లో ఒక రకమైన ఇమేజ్ను, టాలీవుడ్లో మరోరకమైన ఇమేజ్తో మన్నన పొందుతున్నారు.
తాజాగా అట్టకత్తి ఫేమ్ నందిత, లక్ష్మీమీనన్, అనన్య, స్వాతి, వరుత్తపడాద వాలిభర్ సంఘం హీరోయిన్ శ్రీవిద్య వంటి తారలు కుటుంబ కథా పాత్రల్లో నటిస్తూ హోమ్లీ కథానాయికల ఇమేజ్ కోసం పోటీ పడుతున్నారు. నటి లక్ష్మీమీనన్ ఇటీవల మాట్లాడుతూ ప్రేక్షకులు తనను గ్లామర్ పాత్రలో చూడటానికి ఆసక్తి చూపించడం లేదని తెలిపారు. అయితే అందాలారబోస్తూ కమర్షియల్ హీరోయిన్గా రాణించాలన్న ఆలోచన నుంచి హోమ్లీ పాత్రలో నటిస్తూ నటిగా మంచి పేరు తెచ్చుకోవాలనుకోడం అభినందనీయమేనంటున్నారు సినీ విజ్ఞులు.