చెన్నై టు ముంబయ్‌ వయా హైదరాబాద్‌!

 Chennai to Mumbai via Hyderabad!

మణిరత్నం, గౌతమ్‌ మీనన్‌... ఇద్దరూ ఇద్దరే! ఎలాంటి కథతోనైనా, ఏ నేపథ్యంలోనైనా సిన్మాలు తీయగల సత్తా ఉన్న దర్శకులు. ‘అర్జున్‌రెడ్డి’ అలియాస్‌ విజయ్‌ దేవరకొండ... ఒక్క సిన్మాతో ఎలాంటి పాత్రలోనైనా నటించగలననే నమ్మకం కలిగించిన నటుడు. ఇప్పుడీ హీరోపై ఈ దర్శకులిద్దరి కన్ను పడిందట! విజయ్‌తో సినిమాలు తీయాలని మణిరత్నం, గౌతమ్‌మీనన్‌ కథలు రెడీ చేస్తున్నారట! ఆల్రెడీ చెన్నైలో ఆ ఇద్దరితో వేర్వేరుగా ఈ హీరో కలిశారని కోడంబాక్కమ్‌ వర్గాల సమాచారమ్‌. ఓ పక్కన తమిళ దర్శకులు విజయ్‌ కోసంప్రయత్నిస్తుంటే... ముంబయ్‌ నుంచి కూడా ఈ హీరోకి కబురొచ్చిందట!

ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్, దర్శకుడు బిజోయ్‌ నంబియార్‌ తదితరులు విజయ్‌తో డిస్కషన్స్‌ చేస్తున్నారట! సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మకి కూడా విజయ్‌తో ఓసినిమా తీయాలనుందట! వీళ్లిద్దరూ ముంబయ్‌లో ఓసారి కలిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో గీతా ఆర్ట్స్, వైజయంతి మూవీస్, యూవీ క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు నిర్మిస్తున్న సినిమాల్లో విజయ్‌ నటిస్తున్నారు. మరి, ఈ బిజీ షెడ్యూల్‌లో నెక్ట్స్‌ సిన్మా ఎవరికి కమిట్‌ అవుతారో? వెయిట్‌ అండ్‌ సీ!!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top