అమ్మపై కోపం  వచ్చింది! | Sakshi
Sakshi News home page

అమ్మపై కోపం  వచ్చింది!

Published Wed, Jul 18 2018 1:13 AM

Angry that time from mummy :jhanvi kapoor - Sakshi

ఇప్పుడు అందరి దృష్టి శ్రీదేవి  కుమార్తె జాన్వీ కపూర్‌పైనే. ఆమె కథానాయికగా నటించిన తొలి చిత్రం ‘ధడక్‌’ ఈ శుక్రవారం రిలీజ్‌కు రెడీ అవ్వడమే ఇందుకు కారణం. మరాఠీ చిత్రం ‘సైరాట్‌’కు రీమేక్‌ ఇది. శశాంక్‌ కేతన్‌ దర్శకత్వంలో ఇషాన్‌ కట్టర్‌ హీరోగా నటించారు. ‘ధడక్‌’ చిత్రాన్ని ధర్మప్రొడక్షన్స్‌ పతాకంపై కరణ్‌ జోహార్‌ నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలను జాన్వీ బయటపెట్టారు.  తల్లి శ్రీదేవి మీద కోపం వచ్చిన ఓ సంఘటనను ‘ధడక్‌’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా మీడియా ముందు చెప్పారు. ‘‘నాకు దాదాపు పదేళ్ల వయసు ఉన్నప్పుడు అమ్మ, కమల్‌హాసన్‌గారు నటించిన ‘సాద్మా’ సినిమాను చూశా. ఈ సినిమాలో కమల్‌హాసన్‌ను అమ్మ గుర్తుపట్టలేక పోయిన సన్నివేశం నన్ను కదలించింది.

‘నువ్వు.. కమల్‌హాసన్‌ను ఎందుకు గుర్తుపట్టలేదు?’ అని అమ్మతో అలిగి రెండు రోజులు మాట్లాడలేదు. అలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. సాధారణంగా అమ్మ ఎమోషనల్‌గా నటించిన సినిమాలను నేను చూడను. ఎందుకంటే ఎక్కవగా ఏడ్చే క్యారెక్టర్స్‌నే అమ్మ చేసింది. కానీ ‘సాద్మా’లో అమ్మ ఇంకొకరిని ఏడిపించారు’’ అని చెప్పుకొచ్చారు జాన్వీ. ఈ సంగతి ఇలా ఉంచితే.. బాలు మహేంద్ర దర్శకత్వంతో కమల్‌హాసన్, శ్రీదేవి నటించిన తమిళ చిత్రం ‘మూడ్రామ్‌ పిరై’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌ చేశారు. తెలుగులో ‘వసంతకో కిల’ పేరుతో విడుదలైంది. ఈ చిత్రాన్నే హిందీలో ‘సాద్మా’గా తీశారు. ఈ సినిమాలో శ్రీదేవి, కమల్‌ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement