అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు | Interstate gang was arrested in karimnagar | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

Feb 13 2018 2:32 PM | Updated on Aug 21 2018 6:02 PM

Interstate gang was arrested in karimnagar - Sakshi

నిందితులను అరెస్టు చూపుతున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారులు

కరీంనగర్‌క్రైం : కొన్నేళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అధిక ధరలున్న బియ్యాన్ని నమూనాగా చూపించి రేషన్‌బియ్యం అంటగడుతున్న ముఠాను సోమవారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్‌ హెడ్‌క్వార్టర్‌లోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో సీఐలు మాధవి, కిరణ్‌ విలేకరులతో వివరాలు తెలిపారు. ఖమ్మం జిల్లా తల్లడ మండలం అన్నారుగూడెంకు చెందిన సుంకర కనకరావు(42), సోదా వెంకటేశ్వర్లు(35), నర్సింహరావుపేటకు చెందిన గోపిశెట్టి నాగేశ్వర్‌రావు(35) ముఠాగా ఏర్పడ్డారు. ఆటోలో తిరుగుతూ రేషన్‌ బియ్యాన్ని సేకరిస్తున్నారు.

వీటినే ఇంటివద్ద 25 కిలోల బస్తాల్లో నింపి ఊరూరా తిరుగుతూ సన్నబియ్యమని విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే సన్నబియ్యం వస్తుండడంతో జనం కూడా కొనుగోలు చేస్తున్నారు. తీరా ఇంటికెళ్లి చూసేలోగానే వారు అక్కడి నుంచి పరారయ్యేవారు. ఇలా పలు జిల్లాల్లో పదేళ్లుగా మోసాలకు పాల్పడుతున్నారు. వీరిపై ఆయా ప్రాంతాల్లో కేసులు సైతం నమోదయ్యాయి. కరీంనగర్‌లోని తిరుమల్‌నగర్‌కు చెందిన అజ్మీరా రాజు గత నెల 31న ఆటోలో వచ్చిన వీరి నుంచి సన్నబియ్యం మూడు క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇంటికెళ్లి చూడగా  రేషన్‌బియ్యంగా గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గాలిస్తున్నారు. సోమవారం తిరుమల్‌నగర్‌కు వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని.. వారి నుంచి రూ.10,500, ఆటో, బియ్యంబస్తాలు, మెషిన్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.    

 

Advertisement
 
Advertisement
Advertisement