ఢిల్లీ చేరుకున్న పాంపియో | Sakshi
Sakshi News home page

ఢిల్లీ చేరుకున్న పాంపియో

Published Wed, Jun 26 2019 3:57 AM

US Secretary of State Mike Pompeo arrives in India - Sakshi

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌: అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌ బుధవారం ఆయనతో భేటీ కానున్నారు. రష్యా నుంచి ఎస్‌400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు, ఉగ్రవాదం, హెచ్‌1బీ వీసా, వాణిజ్యం, ఇరాన్‌పై ఆంక్షలతో చమురు కొనుగోళ్లపై ప్రభావం వంటి పలు అంశాలు వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. బుధవారం పాంపియో ప్రధాని మోదీతోనూ సమావేశం కానున్నారు. ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో జరిగే కార్యక్రమంలో భారత, అమెరికా వాణిజ్యవేత్తలతో పాంపియో మాట్లాడతారు.   

మోదీతో భేటీ కానున్న ట్రంప్‌
 జపాన్‌లోని ఒసాకాలో 28, 29 తేదీల్లో జరిగే జీ20 దేశాల సమావేశానికి హాజరుకానున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రధాని మోదీసహా పలువురు ప్రపంచ దేశాధినేతలతో సమావేశం కానున్నారు. భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌ ప్రధానులతో పాటు జర్మనీ చాన్స్‌లర్‌ మెర్కెల్, చైనా అధ్యక్షులు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్‌లతో ఆయన సమావేశం కానున్నట్టు యూఎస్‌ ప్రభుత్వాధికారి ఒకరు సోమవారం విలేకరులకు తెలిపారు.

Advertisement
Advertisement