క్రీడా స్టేడియంలో బహిరంగ ఉరి | Thousands in China watch as 10 people sentenced to death in sport stadium | Sakshi
Sakshi News home page

క్రీడా స్టేడియంలో బహిరంగ ఉరి

Dec 19 2017 11:30 AM | Updated on Dec 19 2017 11:30 AM

Thousands in China watch as 10 people sentenced to death in sport stadium - Sakshi

చైనాలో బహిరంగ ఉరిని వీక్షించడానికి హాజరైన ప్రజలు

హాంకాంగ్‌ : మాదక ద్రవ్యాల నేరాలకు పాల్పడుతున్న ఓ గ్యాంగ్‌ను బహిరంగ ఉరి తీయాలని చైనాలోని ఓ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తీర్పు వెలువడిన వెంటనే 10 మంది ముఠా సభ్యులను అధికారులు క్రీడా మైదానంలో ఉరి తీశారు. ఈ ఘటన గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్సులోని లుఫెంగ్‌ అనే ప్రాంతంలో చోటు చేసుకుంది.

పది మందిలో ఏడుగురిపై డ్రగ్స్‌ నేరారోపణలు ఉన్నాయి. మరో ముగ్గురిపై హత్య, దోపిడీ కేసులు ఉన్నాయి. కాగా, గ్యాంగ్‌కు శిక్ష ఖరారు కావడానికి నాలుగు రోజుల ముందే సోషల్‌మీడియా ద్వారా బహిరంగ ఉరిని వీక్షించేందుకు అందరూ రావాలని ఆహ్వానాలు పంపారు. శిక్ష ఖరారు అనంతరం పోలీసులు ట్రక్కుల్లో వారిని స్టేడియానికి తీసుకువచ్చారు. అనంతరం అప్పటికే రన్నింగ్‌ ట్రాక్‌పై ఏర్పాటు చేసిన ఉరి కంభానికి వారిని వేలాడదీశారు.

ఈ తంతును వేలాది మంది ప్రజలు వీక్షించారు. బహిరంగ ఉరిని తిలకించేందుకు యూనిఫామ్‌లో ఉన్న స్కూల్‌ పిల్లలు కూడా వచ్చారు. ‘ఉరి’ శిక్షను ప్రపంచంలో అత్యధికంగా అమలు చేస్తోన్న దేశం చైనానే. గత ఏడాది దాదాపు 2000 మందిని చైనాలో ఉరి తీసినట్లు రిపోర్టులు ఉన్నాయి. నేర ప్రభావం తీవ్రంగా లేకున్నా చైనాలో ఉరి శిక్ష వేయడం ఎప్పటినుంచో జరుగుతోందని అమెరికాకు చెందిన ఓ మానవహక్కుల సంస్థ పేర్కొంది. అయితే, బహిరంగంగా ఉరి శిక్షను అమలు చేయడం మాత్రం చైనాలో అరుదుగా సంభవిస్తుంటుందని తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement