ఆంక్షల ఎత్తివేత : ఎయిరిండియాకు భారీ ఊరట

Pakistan lifts ban on Indian flights, opens airspace closed since Balakot airstrike - Sakshi

పాకిస్తాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తన గగనతలం మీదుగా భారత విమానాల రాకపోకలకు అనుమతినిస్తూ పాక్‌ ఆంక్షలను ఎత్తివేసింది. భారత్‌కు చెందిన అన్ని విమానయాన సంస్థలను తన గగనతలంలో ప్రయాణించడానికి అనుమతినిస్తున్నామని పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఎయిర్ మెన్ (నోటామ్) నోటీసు జారీ చేసింది. మంగళవారం రోజు తెల్లవారుజామునుంచి ఏటీఎస్ (ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్) మార్గాల్లో అన్ని రకాల విమాన సర్వీసులకు తక్షణమే అవకాశం కల్పిస్తుందని పేర్కొంది. తాజా నిర్ణయంతో ప్రభుత్వ రంగ విమాయాన సంస్థ ఎయిరిండియా భారీ ఊరట కలగనుంది.

మరోవైపు గగనతల ఆంక్షలను ఎత్తివేయడానికి పాక్ నోటామ్ జారీచేయడం భారత అధికారులు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. వెంటనే సవరించిన నోటామ్‌ను జారీ చేసింది. తద్వారా సాధారణ విమాన ట్రాఫిక్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని  వెల్లడించినట్టు సమాచారం.

భారత వైమానిక దళం (ఐఎఎఫ్) దాడుల తరువాత పాకిస్తాన్ గగనతలం మూసివేయడంతో సుమారు 491 కోట్ల రూపాయల భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసిన ఎయిర్ ఇండియాకు ఈ నిర్ణయం పెద్ద ఉపశమనం కలిగించగలదని భావిస్తున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్‌  పురీ జూలై 3 న  రాజ్యసభలో సమర్పించిన గణాంకాల ప్రకారం ప్రైవేటు విమానయాన సంస్థలు స్పైస్ జెట్, ఇండిగో, గో ఎయిర్ వరుసగా రూ .30.73 కోట్లు, రూ .25.1 కోట్లు, రూ .12.1 కోట్లు నష్టపోయాయి.

అటు పాకిస్తాన్‌ కూడా మూసివేత నిర్ణయానికి భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ఏదైనా ఒక దేశం గగనతలం మీది నుంచి రాకపోకలు సాగించే విమానాలు వాటి బరువు, ప్రయాణించే దూరాన్ని బట్టి ఆ దేశానికి కొంతమొత్తం చెల్లించాల్సి ఉంటుంది. పాకిస్తాన్‌ మీదుగా ప్రయాణించే బోయింగ్ 737 విమానానికి అయితే 580 డాలర్లు, ఎయిర్‌బస్ 380కి అయితే అంతకంటే పెద్ద మొత్తంలో ఆ దేశ సివిల్ ఏవియేషన్‌కు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మూసివేత తర్వాత దాదాపు రూ.688 కోట్ల (100 మిలియన్ డాలర్లు) మేర నష్టపోయింది. పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్‌ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్‌ తన గగనతలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top