భారత్‌పై అణు దాడి తప్పదు : పాక్‌ | Pakistan Angry over Indian Army Chief Comments | Sakshi
Sakshi News home page

Jan 14 2018 8:49 AM | Updated on Jan 14 2018 2:42 PM

Pakistan Angry over Indian Army Chief Comments - Sakshi

ఇస్లామాబాద్‌ : భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ వ్యాఖ్యలపై దాయాది పాకిస్థాన్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అనవసరమైన ఆరోపణలు చేస్తే అణు దాడి తప్పదని పేర్కొంది. పాక్‌ విదేశాంగ మంత్రి ఖ్వాజా ముహమ్మద్‌ అసిఫ్‌ ఈ మేరకు తన ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు. 

‘‘ఇండియన్‌ ఆర్మీ చీప్‌ భాద్యతారాహిత్యంగా మాట్లాడారు. ఇది ముమ్మాటికీ కవ్వింపు చర్యనే. అణుక్షిపణుల దాడికి భారత్‌ మాకు ఆహ్వానం పంపుతున్నట్లుంది. ఒకవేళ వారు యుద్ధానికి కాలుదువ్వితే అందుకు మేం కూడా సిద్ధమే. భారత్‌పై అణుదాడి తీవ్ర స్థాయిలో చేసి తీరతాం. ఆయన(రావత్‌) అనుమానాలు త్వరలోనే నివృత్తి అవుతాయని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. మరోవైపు విదేశాంగ ప్రతినిధి ఫైసల్‌ కూడా రావత్‌ వ్యాఖ్యలను ఖండించారు. ఈ వ్యాఖ్యలను తేలికగా తీసుకోబోమని ఆయన పేర్కొన్నారు. ఇక రావత్‌ దిగజారి మాట్లాడారని నిఘా వ్యవస్థ ఐఎస్‌పీఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ అసిఫ్‌ గుఫర్‌ మండిపడ్డారు.

శుక్రవారం ఆర్మీడే సందర్భంగా ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ మాట్లాడుతూ... నిబంధనలకు విరుద్ధంగా పాక్‌ అణ్వాయుధాలను తయారు చేస్తోందని ఆరోపించారు. అణు ఒప్పందాలను పాక్‌ ఉల్లంఘిస్తోందని.. పరిస్థితి చేజారితే పాక్‌ వాటిని భారత్‌ పై ప్రయోగించే అవకాశం లేకపోలేదని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం గనుక అనుమతిస్తే పాకిస్థాన్‌పై అణుయుద్ధానికి సైన్యం సిద్ధంగా ఉందని రావత్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement